MLA Padi Kaushik Reddy | హుజురాబాద్, ఏప్రిల్ 20 : తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు సూచించారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన ధర లభించేలా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను సూచించారు.
ముఖ్యంగా తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని, అనవసరంగా కోతలు విధించకుండా న్యాయంగా కొనుగోళ్లు జరపాలని పేర్కొన్నారు. రైతులు మార్కెట్ యార్డ్కు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, తూకం, హమాలీ, రవాణా, చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.