రాయికల్, మే 25 : ఎన్నడూ లేనివిధంగా రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే నడిరోడ్డుపైన యుద్ధం చేయాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి వాపోయారు. ప్రజా పాలన అంటే ధాన్యం కొనకుండా రైతులను గోస పెట్టుడేనా..? అని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. కొన్ని రోజులు ఓపిక పడితే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని, అప్పుడు రైతులకు సమస్యలు ఉండవని చెప్పారు. సోమవారం రాయికల్లో ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు వద్ద రైతులు ధర్నా చేయగా, జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు.
అనంతరం రైతులతో కలిసి మండుటెండలోనే ధర్నా చేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి కాంగ్రెస్ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగాయని గుర్తు చేశారు. కానీ, రెండున్నరేళ్లుగా రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. నేను పండించిన ధాన్యం కూడా ఇరువై రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని, కొనేదిక్కు లేదని వాపోయారు. ఎప్పుడైనా రోహిణీ కార్తె వచ్చేలోగా కొనుగోళ్లు ముగిసిపోయేవని, ఈసారి మాత్రం రోహిణి కార్తె వచ్చినా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా ఉన్నాయన్నారు.
ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అనంతరం జీవన్ రెడ్డి రెవెన్యూ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ, మక్కలు కొన్న తర్వాత బ్యాగులను మిల్లులకు తరలించాలని, ఉన్న ధాన్యం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మక్క కొనుగోళ్లలో లారీల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి మాట్లాడారు. రోజూ ఐదు లారీలను అందుబాటులో ఉంచి తూకం వేసిన బ్యాగులను వెంటనే తరలిస్తామని, రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపి రాజిరెడ్డి, రామచంద్ర రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మలేశ్ యాదవ్, అనిల్, గంగారెడ్డి, రమేశ్, హరీశ్ రావు, నాగరాజు, సుధాకర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.