తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 28: మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య కళాశాలలో సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ‘వైవిధ్యం-22’ పేరిట నిర్వహిస్తున్న జాతీయ సాంకేతిక సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటాపాటలు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొటెక్ ఐటీ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ రవికిరణ్, శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని చెప్పారు.
సాఫ్ట్వేర్ రంగంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలను వివరించారు. విద్యార్థులు ఇలాంటి సాంకేతిక సదస్సుల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల చైర్మన్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ, ప్రతి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాదరాజు మాట్లాడుతూ, మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు సుమారు 800 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 25 అంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. విజేతలకు చివరి రోజు బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు. కళాశాల డైరెక్టర్ నరేందర్రెడ్డి, సీఎస్ఈ హెచ్వోడీ కిశోర్, టీపీవో చంద్రసేనా పాల్గొన్నారు.