జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 11: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎస్సీ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక మినీ ఫంక్షన్ హాల్లో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కలెక్టర్ రవి, ఎమ్మెల్యే సంజయ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చే యాలని చెప్పారు. జిల్లాస్థాయి అధికారులు వా రంలో రెండు గ్రామాలు, పాఠశాలలను క్షేత్ర స్థాయిలో సందర్శించాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని ఆదేశిం చారు. పల్లె ప్రగతి కార్యక్రమంతోనే గ్రామా లాభివృద్ధి జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో వెల్లివిరియాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని సూచిం చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. రోళ్లవాగు ప్రా జెక్టు ఆధునీకరణ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.136 కోట్ల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన పెండిం గ్ బిల్లులపై శాస నసభ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమం ద్వారా గురుకులాలు, కళాశాలలను పరిశుభ్రంగా తీర్చిదిద్దామని వివరించారు. సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
జ్వర సర్వే చేపట్టాలి : జడ్పీ చైర్పర్సన్
జిల్లాలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు విజృంభి స్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా జ్వర సర్వేను మరో సారి చేపట్టాలన్నారు. పలువురు సభ్యులు సభలో సమస్యలను లేవనెత్తారు. జిల్లాలో సాగునీటి పను ల విషయంలో నూతనంగా చేపట్టాల్సిన పనులపై సభ్యుల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలన్నారు. పోడుభూముల పట్టాల సమస్యను రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి పంపించినప్పటికీ ఇప్పటి వరకు పరిష్కారం చూపలేదని వివరించారు.
పారిశుధ్యంపై చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా అన్ని గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో అన్నిరకాల రక్తపరీక్షలు ఉచితంగా చేస్తున్న నేపథ్యంలోప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పింఛన్లు అనర్హులకిస్తే చర్యలు: కలెక్టర్
ఆసరా పింఛన్లను అనర్హులకు మంజూరు చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జీ రవి స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నూతనంగా 31,157 పింఛన్లు మంజూరు చేశామని, కొన్ని కారణాల వల్ల 1,525 పింఛన్ల మంజూరును తాత్కాలికంగా ఆపామని, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన అనంతరం వాటిని కూడా మంజూరు చేస్తామని కలెక్టర్ వివరించారు.
పలు అంశాలపై చర్చ
జడ్పీ సర్వసభ్య సమావేశంలో వివిధ సమస్యలపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో జడ్పీ ఇన్చార్జి సీఈవో రామానుజాచార్య, గ్రంథాలయ సం స్థ చైర్మన్ డా. చంద్రశేఖర్గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.