కరీంనగర్ కలెక్టరేట్, జూలై 26 : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగ ఉండాలని, లోతట్టు ప్రాంతాలతోపాటు జలాశయాలు, చెరువులు, కుంటల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని కరీంనగర్ నూతన కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. ఇక్కడ పని చేసిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నల్గొండ జిల్లాకు బదిలీ కాగా, బుధవారం ఉదయమే విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో సీసీఎల్ఏ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గోపి జిల్లాకు రాగా, బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆర్డీవో కే మహేశ్వర్తో పాటు అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాల తహసీల్దార్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్లో నిర్వహించి, జిల్లాలోని పలువురు అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టర్ సమావేశమందిరంలో ముఖ్య ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరుస వర్షాలతో జిల్లా ప్రజలకు ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఎక్కడికక్కడ సత్వర చర్యలు తీసుకోవాలని, ఇబ్బందుల బారి నుంచి కాపాడాలని ఆదేశించారు. వర్షాలతో అంటురోగాలు ప్రబలే ప్రమాదమున్నందున్న వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్గా ఉండాలని సూచించారు. ఆ తర్వాత నగరంలోని కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్ (ఆర్అంబీ గెస్ట్హౌస్)లో మంత్రి గంగుల కమలాకర్తోపాటు మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ను మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.