గంగాధర, మార్చి 24 : ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా ముందుండి పోరాడింది యువకులేనని, యువతకు తగిన గుర్తింపునివ్వాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పిలుపునిచ్చారు. మండలంలోని మంగపేట జీవీఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 25వ తేదీలోగా ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయాలని, ఏప్రిల్ 14న హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించాలన్నారు.
ఏప్రిల్ 25న గ్రామస్థాయి నుంచి నియోజకవర్గంలో జెండా ఎగురవేయాలని సూచించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అవడంతో కేటీఆర్ రాజీనామా చేయాలని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కేటీఆర్కు పేపర్ లీక్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. సర్వీస్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని,అది కూడా తెలియకుండా బండి, రేవంత్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎకరానికి 10 వేల పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్ తన ఉదారతను చా టుకున్నారని కొనియాడారు. గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్తను గుర్తించి ఆత్మీయ సమ్మేళనంలో పా ల్గొనేలా చూడాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్రావు, దూలం బాలగౌడ్, కొండగట్టు బోర్డు డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఆర్బీఎస్ కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా కార్యకర్తలు ఉన్నరు. రాష్ట్ర సాధనలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలు ఇప్పుడు కూడా పార్టీ బలోపేతానికి సహకరించాలి. మేం ఉద్యమంలో పని చేయడంతోనే అధిష్టానం గుర్తించి పదవులు ఇచ్చింది. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుంది. రామడుగు మండల కేంద్రంలో ఎమ్మెల్యే రవిశంకర్ సహకారంలో అద్భుతరీతిలో గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నం. గంగాధరలో కూడా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తం.
-పొన్నం అనిల్కుమార్, జిల్లా
గ్రంథాలయ సంస్థ చైర్మన్
గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కోసం సైనికుల్లా పని చేయాలి. పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుంది. ఉద్యమకారులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను గుర్తించి ఆత్మీయ సమ్మేళనంలో భాగస్వాములను చేయాలి. నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలు చర్చించుకుని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి. ఆత్మీయ సమ్మేళనాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాష్ట్రం ఏ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిందో సమావేశంలో తమ అభిప్రాయాన్ని తెలుపాలి. ప్రతి ఒక్కరూ పార్టీపై నమ్మకంతో పని చేస్తే విజయం సాధించడం సులభం.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
నాపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకుంట. చొప్పదండి నియోజకవర్గానిది ఒక చరిత్ర. కొండగట్టు దేవాలయం, లక్ష్మీపూర్ పంపుహౌస్, మిడ్ మానేర్, గంగాధర నుంచి బోయినిపల్లి రోడ్డు, గంగాధర మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయం చరిత్రగా నిలుస్తుంది. కార్యకర్తలు పార్టీకి పునాది. వారితోనే పార్టీ బలంగా ఉంటుంది. నియోజకవర్గంలో ఉద్యమకారులకు పట్టం కట్టినం. అదే సమయంలో కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించినం. వినోద్కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చెందింది. బండి సంజయ్ని ఇక్కడి ప్రజలు గెలిపిస్తే కరీంనగర్ అభివృద్ధికి రూపాయి బండి కూడా తీసుకురాలేదు. బలమైన బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వారి కుట్రలను తిప్పికొట్టాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజల బతుకులు మారినయ్. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు. కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలి. పార్టీ బలోపేతం కోసం సైనికుల్లా పని చేయాలి. బీజేపీ నాయకులు యువతను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గుడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నరు. తమ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు తెలంగాణ సర్కారు ఎకరానికి 10 వేలు ఇస్తున్నది. దమ్ముంటే బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలి.
-కనుమల్ల విజయ, జడ్పీ చైర్ పర్సన్