వేములవాడ టౌన్, ఫిబ్రవరి 9: సిరిసిల్ల జిల్లానే శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరున ఉందని, ఈ పేరును నిలబెట్టుకుంటూ మహా శివరాత్రి జాతరను సక్సెస్ చేద్దామని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. అతిపెద్ద మహాశివరాత్రి జాతరను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ , ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సమష్టిగా విజయవంతం చేయాలని చెప్పారు. సామాన్య భక్తులే కేంద్రంగా వారు మె చ్చేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వేములవాడలో ఫిబ్రవరి 17నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం వేములవాడ ఆలయంలోని ఓపెన్స్లాబ్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ అనురాగ్ జయంతి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు బీ సత్యప్రసాద్, ఎన్. ఖీమ్యానాయక్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్ పాల్గొనగా అధికారులకు ఏర్పాట్లపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ట్రాన్స్పోర్ట్, పార్కింగ్, రోడ్ల మరమ్మతులు, అకామిడేషన్ , తాగునీరు, విద్యుత్ సరఫరా, బందోబస్తు, పార్కింగ్, ఆరోగ్యం, పారిశు ధ్యం, క్రౌడ్, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, పబ్లిక్ అడ్రస్ సిస్టం, శివార్చన కార్యక్రమం, సూచికల ఏర్పాటు, ప్రచారం, అనుబంధ ఆలయాలలో ఏ ర్పాట్లు తదితర అంశాలపై పురోగతిని ఆయా శా ఖల అధికారులు సమావేశంలో కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్ల కోసం ఉద్దేశించిన యాక్షన్ ప్లాన్ అమలవుతుందన్నారు. కంట్రోల్ రూంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఈవో కృష్ణప్రసాద్కు సూచించారు.
జాతరలో మే ఐ హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో శానిటేషన్ పకడ్బందీగా చేపట్టాలని, పట్టణాన్ని జోన్లుగా విభజించుకోవాలని, జాతర జరిగే మూడు రోజులు 24 గంటలు షిప్టు పద్ధతిన పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చూడాలని ఆదేశించారు. జాతర పనులు ఏమైనా పెండింగ్లో ఉంటే ఈనెల 15 వ తేదీలోగా పూర్తిచేయలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మూడు షిష్టులలో సిబ్బంది పని చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. బస్తీ దవాఖాన ను శివరాత్రికి ముందే ప్రారంభించాలని సూచించారు. జాతర సందర్భంగా చేపట్టిన అన్ని రోడ్డు ప్యాచ్ వర్క్స్ ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, నాంపెల్లి గుట్టపైన గల స్టెప్ వెల్స్ క్వాలిటీని మెరుగుపరిచి వాడుకలోకి తేవాలని, బస్టాండ్, పార్కింగ్ స్థలాలలో తాగునీరును అందుబాటులో ఉంచాలని, ఆలయ క్యాంటీన్ను తిరిగి వినియోగంలోనికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మన జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలనుంచి కూడా అదనపు బలగాలను బందోబస్తుకోసం ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తామని, ధర్మగుండం కంట్రోల్ రూం, బ్యారికేడింగ్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా చేస్తామని చెప్పారు.
గతం కంటే అధికంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జాతరను పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూస్తామని ఎస్పీ తెలిపారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మా ట్లాడుతూ భక్తులకు జాతర సమస్త సమాచారం లభించేలా ప్రత్యేక యాప్ను సిద్ధం చేసినట్లు, స్మా ర్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా త్వరలోనే యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో టీ శ్రీనివాసరావు, డీఎస్పీ నాగేంద్రాచారి, రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్, జిల్లా రవాణా అధికారి కొండల్రావు, డీఎంహెచ్వో సుమన్, సెస్ ఎండీ రామకృష్ణ, డీపీవో రవీందర్, ఆలయ ఈఈ రాజేశ్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు సమ్మ య్య, అన్వేశ్, వేములవాడ పట్టణ సీఐ వెంకటేశ్, రూరల్ సీఐ బన్సీలాల్, జిల్లాకు చెందిన విధ శాఖల అధికారులు పాల్గొన్నారు.