గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపి, దశాబ్దాల చీకట్లను తుడిచిపెట్టిన గొర్రెల పంపిణీ పథకం, రెండో విడుతకు రెడీ అవుతున్నది. తొలి విడుత విజయవంతంగా అమలు చేసిన రాష్ట్ర సర్కారు, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల కానుకగా వచ్చే నెల 9 నుంచి పంపిణీకి శ్రీకారం చుడుతున్నది. ఈ మేరకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఆధారంగా 1.25 లక్షలు ఉన్న యూనిట్ విలువను ఈ సారి 1.75లక్షలకు పెంచి, అప్పటి మాదిరే ఒక్కో లబ్ధిదారుడికి ఒక పొట్టేలు, 20 గొర్రెలు ఇవ్వబోతున్నది. ఇటీవలే ఆదేశాలు జారీ చేయగా, రంగంలోకి దిగిన అధికారయంత్రాంగం ప్రతి మండలంలో అవగాహన కల్పించి, లబ్ధిదారుల నుంచి డీడీలు సేకరిస్తున్నది. ఎక్కడా అవకతవకలకు తావులేకుండా నిబంధనల్లో మార్పులు చేసి, లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరిగేలా చూస్తుండగా, కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్, మే 26 (నమస్తే తెలంగాణ)
నా దగ్గరే పెద్ద మంద తయారైతది
మాది చానా పేదకుటుంబం. నేను గొర్లు కాసుకుంట బతుకుతున్న. నా భార్య కూలి పనిజేస్తది. కొడుకు ఎవుసం జేస్తున్నడు. పుట్టి బుద్దెరిగిన సంది కాపరిగానే జేత్తున్న. ‘ఒకరి కింద ఎన్ని రోజులు పన్జేసుడు? నాక్కూడా సొంతంగా జీవాలు ఉంటే మంచిగుండు’ అని చానా సార్లు అనుకున్న. ఏండ్లు గడిచిపోయినయ్. నేను కాపరిగానే ఉన్న. నా కోరిక మాత్రం తీరలేదు. కానీ, కేసీఆర్ రూపంలో నా కాయిసు తీరింది. మూడేండ్ల కింద నాకు ఇరువై గొర్రెలు, ఒక పొట్టేలు ఇచ్చిన్రు. వేరోటోళ్ల గొర్లు కాసుడు బంజేసి సారు ఇచ్చిన గొర్లనే సాదుకుంటున్న. ఎదిగినయి అమ్ముకుంట, పిల్లలను మేపు కుంట బతుకుతున్న. అచ్చిన పైసలతోటి మళ్ల కొన్ని జీవాలు కొన్న. ఇప్పుడు నా దగ్గర 80 గొర్లు ఉన్నయ్. నాలుగైదు పొట్టేళ్లు ఉన్నయ్. ఇంకో ఆర్నెళ్లు ఆగితే ఇవి కూడా డబుల్ అయితయ్. నా దగ్గరే పెద్ద మంద తయారైతది. ఇంకేం గావాలి? గొర్లు కాసే కాపరిని మందకు యజమాని చేసిన కేసీఆర్ను మరువం. మా కుటుంబమంతా రుణపడి ఉంటది. మళ్ల గొర్లత్తయని విన్న. ఈ సారి నా కొడుక్కు ఇత్తరట. చానా సంతోషంగ ఉంది.
– కేశవేని కొమురయ్య,
కొత్తపల్లె (పాలకుర్తి మండలం)
రాజన్న సిరిసిల్ల, మే 26 (నమస్తే తెలంగాణ): గొల్లకుర్మలకు రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై గొర్రెలను అందిస్తోంది. మొదటి విడుత ఒక్కో యూనిట్ విలువ 1.25 లక్షలు. ఇందులో లబ్ధిదారుల వాటా కింద 31,500 డీడీ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఈ యూనిట్ విలువను 1.75 లక్షలకు పెంచారు. ఇందులో లబ్ధిదారుల వాటా 43,750 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడుతలో ఉన్నట్లుగానే ఒక యూనిట్లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తున్నారు. అయితే గతంలో లబ్ధిదారుల వాటా బ్యాంకుల్లో డీడీలు తీసి సంబంధిత పశు వైద్యాధికారులకు ఇస్తే సరిపోయేది. కానీ, ఇపుడు నిబంధనల్లో మార్పులు తెచ్చారు. ప్రతి లబ్ధిదారుడు ఆన్లైన్లోనే తన వాటా సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పారదర్శకత ఉంటుంది. వాటా చెల్లించే ముందు సంబంధిత పశువైద్యాధికారిని లబ్ధిదారులు కలిస్తే వారి ఐడీతోపాటు 20 అంకెల కోడ్ను అందిస్తారు. దాని ప్రకారంగానే లబ్ధిదారులు ఏదైనా బ్యాంకులోని తమ ఖాతా నుంచే వాటా సొమ్మును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తమ వాటాను చెల్లించిన గంట వ్యవధిలో ఇచ్చిన సెల్ నంబర్కు మెస్సేజ్ వస్తుంది. ఆ తర్వాత ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్ కాపీలు సంబంధిత పశు వైద్యాధికారికి ఇవ్వాల్సి ఉంటుంది.
ఉమ్మడి పాలనలో ఆదరణ కోల్పోయిన కులవృత్తులకు తెలంగాణ సర్కారు పునర్జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు బతుకునిస్తూ, బాసటగా నిలుస్తున్నది. ఈ క్రమంలో గొల్లకుర్మల ఆత్మగౌరవం, అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అమలు చేసిన బృహత్తర సబ్సిడీ గొర్రెల పథకం యాదవ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుత అద్భుత ఫలితాలు రావడంతో తాజాగా వచ్చే నెల 9వ తేదీ నుంచి రెండో విడుతకు శ్రీకారం చుడుతున్నది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు, ఊరూరా అవగాహన కల్పించి డీడీలు కూడా సేకరిస్తుండగా, కులస్తుల్లో పట్టలేని ఆనందం కనిపిస్తున్నది.
పెద్దపల్లి జిల్లాలో 10,545 యూనిట్లు
జిల్లాలో మొదటి విడుతలో 10,565 మందిని అర్హులుగా గుర్తించారు. అయితే కొన్ని కారణాలతో 10,205 మందికి మాత్రమే యూనిట్లు పంపిణీ చేశారు. అయితే రెండో విడతలో 10,545 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే మొదటి విడుతలో మిగిలిపోయినవారితోపాటు రెండో విడతలో గుర్తించిన వారందరికీ యూనిట్లను జిల్లాలోని 14 మండలాల్లో పంపిణీ చేస్తే రెండో విడుత పరిపూర్ణం అవుతుంది.
జగిత్యాల జిల్లాలో 3,617 యూనిట్లు
జిల్లాలో 21,067 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. మొదటి జాబితాలో 10,557 మంది, రెండో జాబితాలో 10510 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడుతలో 9756 మందికి రూ.91.50 కోట్లను వెచ్చించి గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడుతలో 2020 డిసెంబర్ నుంచి 2021 మార్చి దాకా 7,694 మందికి అందజేశారు. మొదటి, రెండో విడుతలో మిగిలిపోయిన 3617 మందికి వచ్చే నెల 9వ తేదీ నుంచి గొర్రెలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 1200 మంది లబ్ధిదారులు 25 శాతం తమ వాటాను డీడీల రూపంలో చెల్లించారు. మిగిలిన వారి నుంచి సైతం వాటాను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
సిరిసిల్ల జిల్లాలో 4,620 యూనిట్లు
జిల్లాలో రెండు విడుతల్లో 16,162 మందిని అర్హులుగా గుర్తించారు. అయితే మొదటి విడుతలో 11,542 మందికి మాత్రమే యూనిట్లు పంపిణీ చేశారు. అయితే రెండో విడుతలో 4,620 యూనిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో 9,573 యూనిట్లు
జిల్లాలో మొదటి విడతలో 11,236 యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడతలో 13,098 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో 3,525 యూనిట్లు పంపిణీ చేశారు. ఈ నాలుగు మండలాల్లో ఇంకా 153 యూనిట్లు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. వీటితో కలుపుకుని ఇంకా 9,573 యూనిట్లను జిల్లాలోని 12 మండలాల్లో పంపిణీ చేస్తే రెండో విడత పరిపూర్ణం అవుతుంది.
వాహనాలకు జీపీఆర్ఎస్ సిస్టం
గొర్రెల పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, వాటిని సరఫరా చేసే వాహనాల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలను జిల్లా అధికారులే టెండర్ ద్వారా ఎంపిక చేసుకుంటారు. వీటికి జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ఉంటుంది. గొర్రెల లోడ్తో ప్రారంభమైనప్పుడు కిలో మీటర్ రీడింగ్ రాసుకుంటారు. లబ్ధిదారుల గ్రామాలకు చేరిన తర్వాత కూడా రీడింగ్ రాసుకుంటారు. ఈ వాహనాలు తమకు నిర్దేశించిన మార్గంలో తప్పా వేరే మార్గంలో వెళ్లకుండా లబ్ధిదారుల గ్రామాలకు చేరుతాయి. ఇలా వచ్చిన గొర్రెలను అన్ని నియోజకవర్గాల కార్యాలయాల వద్ద ఎమ్మెల్యేలు పంపిణీ చేయాలనే నిబంధన కూడా పెట్టారు.
పంపిణీలో మరింత పారదర్శకత
మొదటి విడుతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ నిబంధనలు పూర్తిగా మార్చింది. గతంలో మాదిరిగా ఇప్పుడు పశు వైద్యాధికారుల ప్రమేయం లేకుండా చేసింది. ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని, కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తారు. మండల ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహిస్తున్న జిల్లా అధికారులనే స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పర్యవేక్షణలోనే రెండో విడుత గొర్రెల పంపిణీ జరుగనున్నది. కరీంనగర్ జిల్లాకు ఈ సారి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే లబ్ధిదారుల వాటా చెల్లింపు నుంచి కొనుగోళ్లు పూర్తయ్యే దాకా పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొనుగోళ్లకు అవకాశం ఇచ్చిన ఆయా రాష్ర్టాల్లో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలోని అధికారి పర్యవేక్షణలో సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ టీమ్స్ ఉంటాయి. వారికి కేటాయించిన రాష్ర్టాల్లో జీవాలను పరిశీలించి వాటి వయసు ఎంత, కొనుగోలుకు పనికి వస్తాయా..? లేదా నిర్ధారించుకుని స్పెషల్ ఆఫీసర్లకు ఏ రోజుకారోజు ఎక్కడ ఎన్ని గొర్రెలు అందుబాటులో ఉన్నాయో సమాచారం ఇస్తారు. దాన్ని బట్టి అవసరమైన రాష్ట్రాలకు స్పెషల్ ఆఫీసర్లు, లబ్ధిదారులు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోళ్లు జరిగిన వెంటనే సంబంధిత గొర్రెలకు రవాణాకు ముందే బీమా సదుపాయం కల్పిస్తారు. లబ్ధిదారుల ఫొటోలతోపాటు 30 సెకన్ల వీడియోను కూడా చిత్రీకరించి ట్రాన్స్ఫోర్టుకు అనుమతి ఇస్తారు.
జూన్ 9 నుంచి పంపిణీ ప్రారంభం
రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 9 నుంచి ప్రారంభించి సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో అధికారికి 400 నుంచి 600 యూనిట్లు గ్రౌండింగ్ చేసే బాధ్యతలు అప్పగించారు. నల్గొండ జిల్లాలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. కాగా, జూన్ 5 నుంచి గొర్రెల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడిన తర్వాత గొల్లకుర్మలు డీడీలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మూడు రోజుల వ్యవధిలోనే వందలాది డీడీలు వచ్చినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. డీడీల చెల్లింపు రోజు రోజుకూ పుంజుకుంటున్నదని స్పష్టం చేస్తున్నారు.
లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం..
రెండో విడుత గొర్రెల పంపిణీని ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తోంది. అందుకు అనుగుణంగా పూర్తి నిబంధనలు మార్చింది. వీటిపై ఇప్పటికే లబ్ధిదారులకు మండలాల వారీగా అవగాహన కల్పించాం. ఏ లావాదేవీలైనా ఆన్లైన్లోనే జరుగుతాయి. జూన్ 9 నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వ పరమైన ఆదేశాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రెటరీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ పంపిణీని పర్యవేక్షిస్తారు. పంపిణీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో నమ్మకం పెరిగింది. ఆన్లైన్లో డీడీలు చెల్లింపు వేగవంతంగా జరుగుతున్నాయి.
– బండారి నరేందర్, పశు సంవర్ధక శాఖ జేడీ, కరీంనగర్
సర్కారు దయవల్ల బ్యారం జేసుకుంటున్నం..
సర్కారు ఇచ్చిన సబ్సిడీ గొర్రెలతో సంపద బాగా పెరిగింది. నాడు ఇక్కడ సంతలు లేక గొర్రెలు, మేకలు కొందామంటే కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేటకు పోయేటోళ్లం. వెంటాపూర్, పెద్దూరులో వార సంతలు పెట్టిండ్రు. ఇక్కడే అమ్ముకుంటున్నం, ఇక్కడే కొంటున్నం. దూరం పోవాల్సిన అవసరం లేదిప్పుడు. నాకు ఒకప్పుడు 20 గొర్లు, మేకల కంటే ఎక్కువుండేవి కావు. సర్కారు ఇచ్చిన గొర్రెలతో ఇయ్యాల వందకు పైగున్నయ్. కాసేందుకు ముగ్గురం కలిసి గుట్టకు పోతున్నం. ఊళ్లల్లో మాంసం దుకాణాలు రెండు మూడైనయ్. జీతగాళ్లమైన మేం సర్కారు దయవల్ల బ్యారగాళ్లమై అమ్ముతున్నం, కొంటున్నం.
– కిషన్, కాపరి (చంద్రంపేట సిరిసిల్ల)
వంద జీవాలైనయ్
మాకు గొర్లతోనే బతుకుదెరువు. ఒకప్పుడు మాకు మస్తు జీవాలుండె. అయితే ఓ నాడు నా అల్లుడికి టక్కరైతే దవాఖానకు తీసుకుపోయినం. 20 లక్షల దాకా ఖర్చయితదని అన్నరు. ఉన్న గొర్లు, మేకలు అన్నీ అమ్మి బతికించుకున్న. తర్వాత ఎట్ల బతుకుతనో అనుకున్న. కానీ, గప్పుడే కేసీఆర్ సారు తెచ్చిన పథకంల నా పేరు అచ్చింది. నాకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు వచ్చింది. అవి ఇప్పుడు 100 గొర్లయినయ్. ఆ సారు పేరు చెప్పుకొనే బతుకుతున్నం. మా ఇంట్ల రెండు యూనిట్లు రావాలె. కానీ నా ఒక్కనికే అచ్చింది. ఇప్పుడు మా అల్లుడు ఉడుత రాజుకు రావాలె.
– కురాకుల రాజయ్య, ఎక్లాస్పూర్ (మంథని మండలం )