రెండో విడుత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వచ్చే సెప్టెంబర్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నది. ఎప్పుడు ప్రారంభించాలనేది త్వరలో నిర్ణయించబోతున్నది. మొదటి విడుతలో 11,236 యూనిట్లు పంపిణీ చేయగా, రెండో విడుతలో 13,098 యూనిట్లు ఇవ్వాల్సి ఉన్నది. అయితే, హుజూరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటికే 3,525 యూనిట్లను అధికారులు పంపిణీ చేయగా, మిగిలిన 9,573 యూనిట్లను 12 మండలాల్లో ఇవ్వనున్నారు. కాగా, మొదటి విడుత పంపిణీలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిబంధనలు మార్చింది. మండలానికో ప్రత్యేకాధికారిని నియమించి, వారి సమక్షంలోనే పంపిణీ చేయనుండగా, అన్ని లావాదేవీలు ఆన్లైన్లోనే జరగనున్నాయి. కొత్త మార్గదర్శకాలపై అధికారులు ప్రతి మండల కేంద్రంలో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
– కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ) : రెండో విడుత గొర్రెల పంపిణీకి రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో మొదటి విడుత 11,236 యూనిట్లు పంపిణీ చేయగా, రెండో విడు త 13,098 యూనిట్లు ఇవ్వాల్సి ఉన్నది. అయితే, ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలోని హు జూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో 3,525 యూనిట్లు పంపిణీ చేశారు. ఈ నాలుగు మండలాల్లో ఇంకా 153 యూనిట్లు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. వీటితో కలుపుకుని ఇంకా 9,573 యూనిట్లను జిల్లాలోని 12 మండలాల్లో ఇవ్వాల్సి ఉన్నది. వచ్చే సెప్టెంబర్ వరకు పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు వారు కసరత్తు చేస్తున్నారు. 2017లో జిల్లాలోని 242 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల పరిధిలోని సభ్యులతో పశు సంవర్ధక అధికారులు గ్రామ సభలు నిర్వహించి అప్పటి వరకు 18 ఏండ్లు నిండిన వారందనీ ఎంపిక చేశారు. అదే సమయంలో లాటరీ ద్వారా ఏ, బీ జాబితాలకు లబ్ధిదారులను ఎంపిక చేసి సీ- ల్యాబ్ పోర్టల్లో నమోదు చేశారు. ఏ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు మొదటి విడుతలో పంపిణీ చేయగా, బీ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు రెండో విడుతగా పంపిణీ చేస్తున్నారు. కాగా, 2017లో గ్రామ సభల్లో ఎంపికై బీ జాబితాలో పేర్లు ఉన్న వారు ఎవరైనా మరణించినట్లయితే వారి నామినీలకు అవకాశం కల్పిస్తున్నారు. లబ్ధిదారులుగా ఎంపికైనపుడు నిరుద్యోగులుగా ఉండి ప్రస్తు తం ఏదైనా ప్రభుత్వ శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగం పొందిన వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. కొత్తగా లబ్ధిదారులను ఎవరినీ చేర్చుకోవడం లేదు.
పెరిగిన యూనిట్ విలువ
గొల్ల, కుర్మలకు రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై గొర్రెలను అందిస్తోంది. మొదటి విడుతలో గొర్రెల పంపిణీ జరిగినప్పడు ఒక యూనిట్ విలువ రూ.1.25 లక్షలు. ఇందులో లబ్ధిదారుల వాటా కింద రూ.31,500 డీడీ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఈ యూనిట్ విలువను రూ.1.75 లక్షల కు పెంచారు. ఇందులో లబ్ధిదారుల వాటా రూ. 43,750 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడుత లో ఉన్నట్లుగానే ఒక యూనిట్లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తున్నారు. అయితే, గతంలో లబ్ధిదారుల వాటా బ్యాంకుల్లో డీడీలు తీసి సంబంధిత పశు వైద్యాధికారులకు ఇస్తే సరిపోయేది. కానీ, ఇప్పుడు నిబంధనల్లో మార్పులు తెచ్చారు. ప్రతి లబ్ధిదారుడు ఆన్లైన్లోనే తన వాటా సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వాటా చెల్లించే ముందు సంబంధిత పశువైద్యాధికారిని లబ్ధిదారులు కలిసినట్లయితే వారి ఐడీతోపాటు 20 అంకెల కోడ్ను అందిస్తారు. దాని ప్రకారంగానే లబ్ధిదారులు ఏదైనా బ్యాంకులోని తమ ఖాతా నుంచే వాటా సొమ్మును ఆన్లైన్లో చెల్లించాలి. లబ్ధిదారులు తమ వాటాను చెల్లించిన గంట వ్యవధిలో ఇచ్చిన సెల్ నంబర్కు మెస్సేజ్ వస్తుంది. ఆ తర్వాత ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్ కాపీలు సంబంధిత పశు వైద్యాధికారికి ఇవ్వాలి.
మరింత పారదర్శకంగా ..
మొదటి విడుతలో ఎదురైన అనుభవాలను దృ ష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ నిబంధనలను పూర్తిగా మార్చింది. గతంలో మాదిరిగా ఇప్పు డు పశు వైద్యాధికారుల ప్రమేయం లేకుండా చేసింది. ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తారు. వీరి పర్యవేక్షణలోనే రెండో విడుత గొర్రెల పంపిణీ జరుగుతుంది. కరీంనగర్ జిల్లాకు ఈసారి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, లబ్ధిదారుల వాటా చెల్లింపు నుంచి కొనుగోళ్లు పూర్తయ్యే వరకు పూర్తిగా పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోళ్లకు అవకాశం ఇచ్చిన ఆయా రాష్ర్టాల్లో పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలోని అధికారి పర్యవేక్షణలో సెంట్రల్ పొక్యూర్మెంట్ టీమ్స్ ఉంటాయి. జిల్లా నుంచి ఏరోజుకారోజు ఎక్కడ ఎన్ని గొర్రెలు అందుబాటులో ఉన్నాయో ఇక్కడి స్పెషల్ ఆఫీసర్లకు స మాచారం ఇస్తారు. దాన్ని బట్టి అవసరమైన రాష్ట్రాలకు వెళ్లి లబ్ధిదారులు గొర్రెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోళ్లు జరిగిన వెంటనే సంబంధిత గొర్రెల రవాణాకు ముందే బీమా సదుపాయం కల్పిస్తారు. లబ్ధిదారుల ఫొటోలతోపాటు 30 సెకన్ల వీడియోను చిత్రీకరించి ట్రాన్స్ఫోర్టుకు అనుమతి ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ చేసిన వాహనాలను కూడా జిల్లా అధికారులే టెండర్ ద్వారా ఎంపిక చేసుకుంటారు. వీటికి జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ఉంటుంది. గొర్రెల లోడ్తో ప్రారంభమైనప్పుడు కిలో మీటర్ రీడింగ్ రాసుకుంటారు. లబ్ధిదారుల గ్రామాలకు చేరిన తర్వాత కూడా రీడింగ్ రాసుకుంటారు. ఈ వాహనాలు తమకు నిర్దేశించిన మార్గంలో తప్ప వేరే మార్గంలో వెళ్లకుండా లబ్ధిదారుల గ్రామాలకు చేరుతాయి. ఇలా వచ్చిన గొర్రెలను అన్ని నియోజకవర్గాలకు కార్యాలయాల వద్ద ఎమ్మెల్యేలు పంపిణీ చేయాలనే నిబంధన కూడా పెట్టారు.
లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం
రెండో విడుత గొర్రెల పంపిణీపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో 153 యానిట్లు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉన్నది. ఈ మండలాలు మినహా జిల్లాలోని 9 మండలాల్లో ఇప్పటికే అవగాహన కల్పించాం. ఇంకా మానకొండూర్, గన్నేరువరం, కరీంనగర్ అర్బన్ మండలాల్లో మాత్రమే అవగాహన కల్పించాల్సి ఉంది. పంపిణీ పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఏ లావాదేవీలైనా ఆన్లైన్లోనే జరుగుతాయి. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పంపిణీ చేస్తాం. రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రెటరీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ వరకు పంపిణీ పూర్తి కావాలని ప్రభుత్వ పరంగా ఆదేశాలున్నాయి. త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయి.
– బండారి నరేందర్, పశు సంవర్ధక శాఖ జేడీ