ధర్మపురి, ఆగస్టు 23: దివ్యాంగులకు దేశంలోని మరే రాష్ట్రంలో 4016 పెన్షన్ ఇవ్వడం లేదని, అత్యధికంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా కేవలం 950 మాత్రమే ఇస్తున్నారని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇంకా తక్కువే ఉందని, అక్కడ చేయనోళ్లు, ఇయ్యనోళ్లు ఇక్కడేదో చేస్తామని, ఇస్తామని నీతులు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు. ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో బుధవారం ధర్మపురి నియోజకవర్గంలో 5457 మంది లబ్ధిదారులకు పెరిగిన పింఛన్కు సంబంధించిన 2.19కోట్ల విలువైన చెక్కును, బీడీ టేకేదారులకు కొత్త పింఛన్ మంజూరు పత్రాలను అందజేసి, మాట్లాడారు. దివ్యాంగులకు వెన్నుదన్నుగా, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకుసాగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో పింఛన్లు పెంచాలని ఎవరూ అడుగలేదని, దరఖాస్తు చేయలేదని, ధర్నాలు చేయలేదని, కానీ సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అవసరాలకు అనుగుణంగా 4016 అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 5లక్షల మంది దివ్యాంగులకు రూ.వెయ్యి పెంచడం వల్ల ఏడాదికి 624 కోట్లు అదనపు భారం పడుతున్నదని, అయినా వెనక్కి తగ్గకుండా సాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. దివ్యాంగులకు గృహలక్ష్మి పథకంలో 5శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. మరో పక్క దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, మోటారు వాహనాలు, ల్యాప్టాప్లు, బదిరులకు 4జీ స్మార్ట్ సెల్ఫోన్లు ఇంకా అనేక ఉపకరణాలు ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే బీడీ కార్మికులతోపాటు కొత్త టేకేదారులకు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, సుధారాణి, జిల్లా సంక్షేమాధికారి డా.నరేశ్, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంపీఓ నరేశ్, డీపీఎంలు వనజ, వెంకట్రెడ్డి, మల్లేశ్, వివిధ మండలాల ఏపీఎంలు పాల్గొన్నారు.