Collector Koya Sri Harsha | పెద్దపల్లి రూరల్, మే 16 : రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేస్తుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి బస్టాండ్ వద్ద గల గోదాంలో జీలుగు విత్తనాల పంపణీనీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ రైతులకు 50శాతం రాయితీపై పచ్చిరొట్ట(జీలుగ)విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. రాబోయే వానాకాలం పంట కోసం 51 సేల్స్ పాయింట్ల వద్ద ఆన్ లైన్ ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో 6 వేల క్వింటాల్లో జీలుగ , 600 క్వింటాళ్ల జనుము విత్తనాలు సబ్సిడీపై పంపిణీకి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీలుగ 30 కేజీల బస్తా పై రూ.7125, జనుము 40 కేజీల బస్తా పై రూ.6275 సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. పంట మార్పిడీలో భాగంగా పచ్చిరొట్ట ఎరువులను పెంచడం సేంద్రియ వ్యవసాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం అని నేల సారాన్ని పెంపొందించడంలో సహాయ పడతాయన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ.. రైతులకు పచ్చిరొట్ట(జీలుగు), జనుము విత్తనాలు సబ్సిడీ పై గతం కంటే పెద్ద ఎత్తున ముందస్తుగానే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వ్యవసాయ శాస్త్రజ్ఞులు పెద్ద ఎత్తున రైతులకు నేరుగా ఆధునిక సాగు పద్ధతుల పై అవగాహన కల్పిస్తున్నారన్నారు. రైతులకు నాణ్యమైన పంట పండే విధంగా, భూముల సారం కోల్పోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రజ్ఞులు గ్రామాలకు పంపే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతీ మండల కేంద్రంలో రైతులకు భూసారం కోల్పోకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప-సురేందర్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి కాంతాల అలివేణీ, ఏఈవో వినయ్ కుమార్ తదితరులతో పాటు సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.