హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి15: హుజూరాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో దళిత బంధు సమగ్ర కుటుంబ సర్వే కార్డులను బుధవారం ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. 29వ వార్డు గాంధీనగర్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సమగ్ర కుటుంబ సర్వే దళితబంధు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఏడో వార్డులోని బండ అంకుస్వాడలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, 29, 30వ వారుల్లో చైర్ పర్సన్ గందె రాధిక, కౌన్సిలర్లు ముక రమేశ్, తోట రాజేంద్రప్రసాద్ దళిత బంధు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో 1624 దళిత కుటుంబాలు పథకానికి ఎంపిక కాగా 1538 మంది లబ్ధిపొందగా, 1496 మందికి కార్డులు వచ్చాయన్నారు. మిగతా కార్డులు త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు.
దళిత బంధు కార్డులో సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో పాటు కుటుంబ యజమాని పేరు, రేషన్ కార్డు నంబర్, కులం, లబ్ధి పొందిన తీరు, క్యూఆర్ కోడ్, ఐడీ నంబర్ ఉంటాయన్నారు. ఈ కార్డు ఉంటే మొత్తం కుటుంబ ఆర్థిక స్థితిగతుల వివరాలున్నట్లుగానే భావించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో సమగ్ర వివరాలతో దళిత బంధు కార్డులను ఉచితంగా అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, దళిత బంధు పురపాలక ఇన్చార్జి భుమానందం, మెప్మా డీఎంసీ శ్రీవాణి, ఏడీఎంసీ మానస, సీఎల్ఆర్పీలు రమాదేవి, స్వరూప, ఆర్పీలు ఉన్నారు.