జగిత్యాల టౌన్, మార్చి 27: వాతావరణ అనుకూల, మేలైన రకాలను మాత్రమే ఎంచుకొని పంటలు సాగు చేయాలని ఉత్తర తెలంగాణ మండల రైతులకు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పీ రఘురాంరెడ్డి సూచించారు. బుధవారం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉత్తర తెలంగాణ మండల పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశాన్ని సంచాలకులు డాక్టర్ సుధారాణి, అనుబంధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించి, మాట్లాడారు. రైతులు సరైన శాస్త్రీయ, సాంకేతిక యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్నారు.
ఒక్క వరి పంటపైనే ఆధారపకుండా ఇతర రకాలను కూడా ఎంచుకుంటేనే అధిక ఆదాయాన్ని పొందవచ్చన్నారు. పరిశోధన స్థానం ద్వారా ఇచ్చే సూచనలు, సలహాలు రైతులు పాటించాలని, అప్పుడే పంట నష్టం జరుగకుండా కాపాడుకోవచ్చన్నారు. పురుగు మందులను ఎక్కువ మోతాదులో వాడవద్దని సూచించారు. పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ జీ శ్రీనివాస్ మాట్లాడారు. గతేడాది వరి, చెరుకు, పత్తి, సోయా చిక్కుడు, శనగపై చేసిన పరిశోధనలను రైతులకు వివరించారు. అనంతరం రైతుల సందేహాలను ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జీ మంజులత నివృత్తి చేశారు.
ఆదిలాబాద్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ విస్తరణకు సంబంధించిన ఫలితాలను రైతులకు వివరించారు. ఉత్తర తెలంగాణలో ఉన్న 10 జిల్లాల వ్యవసాయ అధికారులు వారి జిల్లాల్లో ఉన్న పంటలు, ఎదురైన సమస్యలను, చిరుసంచుల దశలో ఉన్న వివిధ రకాల పంటల రకాల ఫలితాలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. కార్యక్రమంలో సుమారు 250 మంది రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, అనుబంధ శాఖల అదికారులు, యూనివర్సిటీ ప్రధాన శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.