కరీంనగర్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : టికెట్ల కేటాయింపులపై కాంగ్రెస్ పార్టీలో రగుతులున్న విభేదాలు కరీంనగర్ జిల్లాకు చేరాయి. బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్కు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో అసలైన కార్యకర్తలు భగ్గుమన్నారు. కష్ట కాలంలో ఉన్నపుడు పార్టీని కాపాడుకుని, గుర్తింపు తెచ్చిన వారిని విస్మరించి ఎన్నికల సమయానికి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డిని కాదని పురమల్లకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్లోని డీసీసీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తాము చేసిన తప్పేమిటో కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలని నినదించారు. అభ్యర్థి వచ్చి బుజ్జగించే ప్రయత్నం చేసినా నరేందర్రెడ్డి వర్గీలు వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అసలైన పార్టీ శ్రేణులు లేకుండానే కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం సాగించారు.
సీనియర్లను, ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించి ఎన్నికలప్పుడే పార్టీలోకి వచ్చిన పురమల్ల శ్రీనివాస్కు టికెట్ కేటాయించడంతో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంగళవారం కరీంనగర్లోని డీసీసీ కార్యాలయం ఎదుట అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. రెండు పర్యాయాలు అధికారంలో లేకున్నా కష్టపడి పార్టీ ఉనికి నిలబెట్టుకుంటూ వచ్చిన తమను విస్మరించి, ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన పురమల్ల శ్రీనివాస్కు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఎలా కేటాయిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండి పడ్డారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వెంట నిలబడిన వారిని అధిష్టానం ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. డబ్బులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్లకే టికెట్ కేటాయిస్తే పార్టీ కోసం, సిద్దాంతాల కోసం పనిచేస్తున్న కార్యకర్తలను ఎన్నికల సమయంలో విస్మరించడం కాంగ్రెస్ పెద్దలకు ఎంత వరకు సమంజసమని నిలదీశారు. 2014 నుంచి ఇప్పటి వరకు రెండు పర్యాయాలు అధికారంలో లేకున్నా, ఒక్కొక్కరు పార్టీని వీడి పోతున్నా కరీంనగర్ అసెంబ్లీలో కోమటిరెడ్డి నరేందర్రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వచ్చామని కొందరు నాయకులు వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ఏ ఒక్కనాడు పట్టించుకోని, కార్యకర్తలతో, పార్టీతో సంబంధం లేని పురమల్ల శ్రీనివాస్కు టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా హతాషులయ్యారు.
డీసీసీ ఆఫీసు ఎదుట ధర్నా
సీనియర్ నాయకులు, పార్టీ కోసం కష్టపడిన నాయకులను కాదని పురమల్ల శ్రీనివాస్కు టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ టికెట్ ఆశించిన నాయకులు తీవ్ర అసంతప్తితో ఉన్నారు. పార్టీ టికెట్ ఆశించి చివరి నిమిషం వరకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్సీ టీ సంతోష్కుమార్, సీనియర్ నాయకులు వైద్యుల అంజనీకుమార్, మేనేని రోహిత్రావు, రేగులపాటి రమ్యారావు తీవ్ర నిరాశకులోనయ్యారు. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికైనా టికెట్ వస్తుందని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తూ వచ్చారు. తీరా నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన పురమల్ల శ్రీనివాస్కు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలను కాంగ్రెస్ నాయకులు సంధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి అనుచరులు మంగళవారం డీసీసీ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. నరేందర్రెడ్డికి టికెట్ కేటాయించక పోవడంతో పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరేందర్రెడ్డి జిందాబాద్ అంటూ నినదించారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన పురమల్ల శ్రీనివాస్ నరేందర్రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. టికెట్ కేటాయింపులో తమను కనీసం సంప్రదించకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని తమను తీవ్రంగా అవమాన పర్చిందని కార్యకర్తలు పురమల్లపై మండిపడ్డారు. ఇన్నాళ్లూ కష్టపడినా గుర్తింపు లేకుండా పోయిందని, పార్టీ కోసం కృషి చేసిన వారిని పూర్తిగా విస్మరించిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి అక్కడే ఉండగా నరేందర్రెడ్డితో పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లి పోయారు. కాగా, మంగళవారం సాయంత్రం అసలైన పార్టీ కార్యకర్తలు లేకుండానే కరీంనగర్లోని భగత్నగర్లో పురమల్ల శ్రీనివాస్ తన ప్రచారాన్ని ప్రారంభించారు.
అసంతప్తికి కారణాలివేనా?
బొమ్మకల్ సర్పంచ్గా ఉన్న పురమల్ల శ్రీనివాస్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై ఆ పార్టీలో తీవ్ర అసంతప్తి సెగలు కక్కుతోంది. ఎందరెందరో సీనియర్ నాయకులు టికెట్ ఆశించి రెండు మూడేళ్లుగా ఒక ప్రణాళిక ప్రకారం పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయిన ఎం సత్యనారాయణ రావు మనవడు రోహిత్రావు ఇక్కడి నుంచి పోటీ చేయాలని కొంత కాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. టికెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన అధిష్టానంపై ఒత్తిడి కూడా తెచ్చారు. అయినా, అతనికి టికెట్ దక్కలేదు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నరేందర్రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
అట్టడుగు స్థాయికి దిగజారిన పార్టీకి తిరిగి జీవం పోసి ఉనికి కాపాడుకుంటూ వచ్చిన ఆయనకు కూడా పార్టీ మొండి చేయి చూపింది. సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ను వదిలి హుస్నాబాద్కు వెళ్లడంతో రేగులపాటి రమ్యారావు లాంటి నాయకులు కూడా కరీంనగర్ టికెట్పై కన్నేశారు. స్థానికంగా జరిగే కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటూ వచ్చారు. టికెట్ తమకే వస్తుందని ఎన్నో ఆశలు పెంచుకున్నప్పటికీ చివరికి పార్టీతో సంబంధం లేని వ్యక్తికి టికెట్ కేటాయించడం వీరందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీ కోసం ఇన్నాళ్లూ కష్టపడినా ఎవరికో ఒకరికి టికెట్ వచ్చినా ఫరవా లేదనుకుంటూ వచ్చిన సీనియర్లందరినీ విస్మరించి పార్టీకి సంబంధం లేని వ్యక్తికి టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమంటున్నాయి.. అంతే కాకుండా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న పురమల్లకు టికెట్ కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.