ధర్మపురి, నవంబర్ 9: “స్వరాష్ట్రంలో సంక్షే మం, అభివృద్ధితో సంతోషంగా సాగిపోతున్న మన జీవితాలను ఆగం చేసేందుకు దుష్టశక్తులన్నీ ఒక్కటైనయి. కాంగ్రెస్తో కలిసి మళ్లీ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు వస్తున్నయి. నేనొక్కటే చెబుతున్నా. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణకు చాలా ప్రమాదం. రాష్ట్రం అంధకారమైతది. మన పథకాలన్నీ ఆగమైతయి. అలాంటి వాళ్లు మనకు అవసరమా..? మీరే ఆలోచించండి’ అంటూ ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థిగా ధర్మపురి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మాట్లాడారు. అధికారంలో ఉన్నన్నినాళ్లు రైతులకు సరిపడా కరెంటు ఇవ్వకుండా, అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్, ఇప్పుడు రైతు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నదని మండిపడ్డారు. సాగుకు 24గంటల ఉచిత విద్యుత్ అవసరం లేద ని, 3 గంటలే చాలని రేవంత్రెడ్డి సిగ్గులేని వ్యాఖ లు చేశారని దుయ్యబట్టారు.
అంటే ఈ లెక్కన కాంగ్రెస్ వస్తే 24గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించినట్లుగా అనిపిస్తున్నదన్నారు. రైతన్న మేలు కోరి ఇచ్చే రైతుబంధును కాంగ్రెస్ మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి దండుగ అని అంటున్నారని, రైతుబంధును నిలిపివేయాలని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఒక్కటే కాదు పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను నిలిపివేసేందుకు కుట్ర పన్నుతోందని, అలాంటి పార్టీని బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెబుతున్నదని, కానీ ఏ ఒక్కటీ చేయరని, కర్ణాటకలోనూ ఇలాగే రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు, కులం ముఖ్యం కాదని వ్యవస్థ ముఖ్యమని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమన్నారు.
వ్యవస్థ కోసం పనిచేసే నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అన్ని వర్గాలను సమానంగా చూసే కేసీఆర్ ప్రభుత్వమే కొనసాగాలంటే అందరం ఐక్యంగా ఉండాలన్నారు. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా రాష్ట్రంలో ఇస్తున్నట్లుగానే 24గంటల కరెంటు ఇస్తామని కర్టాటకలో ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చారనీ, ఐదు నెలలు గడుస్తున్నా..? అక్కడ ఎందుకు సాధ్యం కావడంలేదో ఆ పార్టీ నాయకులే చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ పులిలాంటివారని, అధికారం కోసం అబద్దపు మాట లు చెబుతున్న కాంగ్రెస్ జిత్తుల మారి నక్క అని ఎద్దేవా చేశారు. ‘పులి పులే.. నక్క నక్కే.. బీఆర్ఎస్ బీఆర్ఎస్సే.. కాంగ్రెస్ కాంగ్రెస్సే.. అంటూ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ను ఢీకొట్టే నాయకుడు దేశంలోనే లేరని గర్వంగా చెప్పుకోవచ్చని, అంతటి మహనీయుని బాటలో సమాజ శ్రేయ స్సు కోసం మనందరం నడవాల్సిన బాధ్యత ఉం దని సూచించారు. ‘ఈ ఎన్నికల్లో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలో కేసీఆర్ నాయకత్వం కనబడాలి. కార్యకర్తలందరూ కొప్పుల ఈశ్వర్లై పనిచేయా లి’ అని మంత్రి ఈశ్వర్ శ్రేణులకు సూచించారు.
‘నేను ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్న. నేనెప్పుడైనా.. మంత్రి లెక్క, ఎమ్మెల్యే లెక్క ఫీల్ కాలె. మీలో ఒకడిగానే ఉన్న. కింద కూసుంట.. చాపల కూసుంట.. గాలిమోటర్ల పోత.. కార్ల పోత.. ఆటోల పోత.. అవసరం ఐతే నడిసిపోత.. ప్రజలు ఎక్కడ చేయి అడ్డం పెట్టి ఆపితే అక్కడ ఆగుత.. ‘అన్నా.. ఇయ్యాల ఇక్కడనే ఉండాల్నె’ అని ప్రజలు కోరితే ఆన్నే ఉంటా.. సమస్యలు ఏందో తెలుసుకుంట.. పరిష్కారం అయ్యేదాక నిద్రపోను. గిసోంటి నన్ను దూరం చేసుకుంటరా?. ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన. దవాఖాన్ల పడితే ఆదుకున్న. ప్రతి ఇంట్లో ఒక్కడినై ఉన్న. 14 ఏండ్లుగా ధర్మపురి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు మరువలేనవి. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిది. మీకు నాయకుడిగా కాదు. మీ సేవకుడిగా ఉంటా. మరొకసారి మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి’ అంటూ మంత్రి ఈశ్వర్ మాట్లాడిన మాటలకు ప్రజలు ఫిదా అయిపోయారు. కేరింతలు కొడుతూ..ఈలలు వేశారు.
‘నాకు ధర్మపురి నియోజకవర్గం అనే పొలం ఉంది. అందులో 146 మడుల్లాంటి గ్రామాలున్నయి. ఒక రైతు రాత్రి, పగలు కష్టపడి తన పొలంలో ఏ ఒక్క మడినైతే ఎండనివ్వడో.. అదే మాదిరిగా ప్రతి గ్రామాభివృద్ధికి పాటుపడుతా. ఇప్పటికే ప్రతి గ్రామంపై దృష్టి సారించి అభివృద్ధి చేసిన. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని’ మంత్రి ఈశ్వర్ కోరారు.
ధర్మపురి గులాబీమయమైంది. కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచీ పార్టీ శ్రేణులు సహా ప్రజానీకం భారీగా తరలివచ్చింది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. లక్ష్మీనరసింహ గార్డెన్స్ నుంచి దుర్గాకాలనీ, అంబేద్కర్ చౌక్, తె లంగాణ తల్లి విగ్రహం నుంచి గాంధీ, పటేల్, వివేకానంద కూడలి దాకా డీజే మోతలు, కార్యకర్తల నృత్యాలు, ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలతో ర్యాలీ జరుగగా, ఉదయం 9 గంటలకే ధర్మపురి జనసంద్రమైంది. 11గంటలకు మంత్రి ఈశ్వర్ నామినేషన్ వేశారు.
కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీలు చిట్టిబాబు, కరుణశ్రీ, లక్ష్మి, బలరాంరెడ్డి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, రాజేందర్రావ్, పద్మజ, సుధారాణి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్లు అయ్యో రి రాజేశ్కుమార్, వెంకటేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కౌన్సిలర్లు అయ్యోరి వేణు, అశోక్, యునుస్, అనంతుల విజయలక్ష్మి-లక్ష్మణ్, వొడ్నాల ఉమాలక్ష్మి-మల్లేశం, పురాణపు కిరణ్మయి-సాంభమూర్తి, కార్తీక్, నాయకులు వెంకటేశ్వరావ్, మురికి శ్రీనివాస్, భారతపు గుండయ్య, చిలివేరి శ్యాంసుందర్, సంగి శేఖర్, అక్కపల్లి సురేందర్, గునిశెట్టి రవీందర్, వేముల నరేశ్, స్తంబంకాడి మహేశ్ ఉన్నారు.