చొప్పదండి పట్టణవాసుల చిరకాలవాంఛ ఆయన సెంట్రల్ లైటింగ్ నిర్మాణం ఇక కలేనా? అంటే.. ప్రస్తుత పనుల పరిస్థితి చూస్తే అలాగే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వం పట్టణ రూపురేఖలను మార్చేందుకు రహదారి విస్తరణ పనులు చేపట్టింది. అందులో భాగంగా 33 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు ఆగిపోవడంతో పట్టణవాసులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది.
చొప్పదండి, మార్చి 18 : మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న చొప్పదండిని కేసీఆర్ ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చింది. అంతే కాకుండా, పట్టణ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు 33 కోట్లతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు ప్రారంభించింది. సైడ్ డ్రైన్, రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పట్టణ ప్రధాన కూడలిలో పనులు పూర్తికాకుండా రోడ్డును వ్యాపారులు ఆక్రమించడం వల్ల ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులు మధ్యలోనే ఆగిపోగా, సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టణంలోని మర్లవాడ నుంచి గుమ్లాపూర్ ఎక్స్ రోడ్ వరకు ప్రధాన రహదారిలో డివైడర్ నిర్మించాల్సి ఉండగా, మధ్యలోనే ఆపేశారు. డివైడర్ నిర్మాణం ఆపిన ప్రాంతంలో సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం, రోడ్డు ఇరుకుగా మారడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. రోడ్డు పక్కన మట్టిని తీయక పోవడంతో విపరీతంగా దుమ్ము లేచి ఇబ్బంది పడుతున్నారు.
చొప్పదండి పట్టణంలో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ పనులు ఆగిపోయాయి. పైఅధికారుల నుంచి ఆదేశాల రాగానే పనులను మొదలు పెడుతాం. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేస్తాం.
– కే నాగరాజు, చొప్పదండి మున్సిపల్ కమిషనర్