మల్యాల, జనవరి 3 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని, కొండగట్టు ఆంజనేయస్వామి అనుగ్రహంతో సీం కేసీఆర్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ కేవలం ప్రజాసేవకుడే కాదని, దైవ సేవకుడిగా సైతం సేవలందిస్తున్నారని కొనియాడారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మహా దివ్యక్షేత్రంగా పునర్నిర్మించామని గుర్తుచేశారు. కొండగట్టు అంజన్న, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి క్రమపద్ధతిన నిధులు విడుదల చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
కొండగట్టు క్షేత్రం అభివృద్ధితోపాటు ఆలయ పునర్నిర్మాణం కోసం 100 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. స్పీకర్ మంగళవారం మల్యాల మండలం కొండగట్టుకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోనే కొండగట్టు అంజన్న ఆలయం ఎంతో విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రమన్నారు. ఏటా హనుమాన్ చిన్న జయంతి, పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా లక్షల మందికి పైగా దీక్షాపరులు స్వామివారిని దర్శించుకుంటారని, భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగా కొండగట్టు అంజన్నపై అపారమైన విశ్వాసముందని పేర్కొన్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలన దేశవ్యాప్తంగా విస్తరించేలా శక్తిని ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నామన్నారు. తద్వారా దేశంలో ఉన్న పేదరికం, రైతులు తమ వృత్తుల ద్వారా ఆర్థికవృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాశ్ నేతృత్వంలో గౌరవ వందనం ఏర్పాటు చేయగా, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రమణమూర్తి, కొడిమ్యాల, పెగడపల్లి, బుగ్గారం ఎస్ఐలు వెంకట్రావ్, కొక్కుల శ్వేత, అశోక్ ఉన్నారు.
వేద పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పట్టువస్ర్తాలు
కొండగట్టుకు వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వేద పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్నులు, నోట్బుక్లతో పాటు నూతన పంచెలు, కండువాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆలయ అతిథిగృహంలో పంపిణీ చేశారు.
కాసేపు టీచర్గా మారిన వినోద్కుమార్
వేదపాఠశాల విద్యార్థులతో స్పీకర్ శ్రీనివాస్రెడ్డి ముచ్చటిస్తున్న క్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కాసేపు టీచర్గా మారారు. ‘పిల్లలూ మీ పాఠశాలకు వచ్చింది ఎవరో తెలుసా?’ అంటూ ప్రశ్నించారు. ఆయన తెలంగాణ శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అని, బాన్సువాడ ఎమ్మెల్యే అని పరిచయం చేశారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను బాన్సువాడలో చేపట్టారని, టీటీడీ తరహాలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారని చెప్పారు. ‘మీరు వసతి గదుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను టీవీల్లో చూస్తున్నారా..?’ అని అడిగారు. ఈ సందర్భంగా టీటీడీ ఎస్వీబీసీ, భక్తి ఛానల్ ప్రసారాల్లో శ్లోకాలు, నిత్యపూజలను విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్, ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్రప్రసాద్కు సూచించారు.