‘బియ్యం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్యుల కోసం భారత్ రైస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. 29కే కిలో సన్నబియ్యం. ఎవరికి కావాలనా మీ సమీపంలోని కేంద్రీయ భండార్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్ కేంద్రాల్లో కొనుగోలు చేసుకోవచ్చు’ అంటూ ఊదరగొట్టిన కేంద్రం.. ఆచరణలో ఉసూరుమనిపించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రారంభించినట్లుగా ప్రచారం చేసుకున్నా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం అదంతా వట్టిదేనని తేలిపోయింది.
స్కీం మొదలై దగ్గరగా నెల కావస్తున్నా.. విక్రయ కేంద్రాలు ఎక్కడ తెరిచారో..? భారత్ రైస్ ఎక్కడ విక్రయిస్తున్నారో.. ఎవరికీ తెలియదు. ఏ మూలన వెతికినా అడ్రస్సే కనిపించడం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా తమకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు రాలేదని, పథకంపై అవగాహన లేదని చెబుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుండగా, అసలు ఇప్పటిదాకా జిల్లాలో సెంటరే ఓపెన్ కాలేదని, ఇంతోటిదానికి హంగులు, ఆర్భాటాలెందుకని ప్రజానీకం మండిపడుతున్నది.
జగిత్యాల, మార్చి 2 (నమస్తే తెలంగాణ): నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఎగుమతి, దిగుమతుల పాలసీ సరిగా లేకపోవడంతో దినసరి వెచ్చాలైన బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు లాంటి వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సన్నబియ్యం కొనుగోలు సామాన్యుడికి పెద్ద సమస్యగానే పరిణమించింది. మార్కెట్లో సోనా మసూరి, బాపట్ల మసూరి, జైశ్రీరామ్ లాంటి వెరైటీలు కిలోకు 50 నుంచి 70 వరకు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరిట 29కే సన్నబియ్యం విక్రయిస్తామంటూ విస్తృత ప్రచారం చేసింది.
గత నెల 7న ఆర్భాటంగా భారత్ రైస్ విక్రయ పథకాన్ని ప్రారంభించింది. అయితే భారత్ రైస్ను విక్రయించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా), ఎన్సీసీఎఫ్ (నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా), కేంద్రీయ భండార్కు అప్పగించడమే జిల్లా ప్రజలకు పెద్ద శాపంగా మారింది. అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా భారత్ రైస్ అందుబాటులోకి రాలేదని తెలుస్తున్నది. జగిత్యాలలో చూస్తే అసలు నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ సంస్థలకు బ్రాంచ్లు లేనే లేవు.
ఫలితంగా పథకం ప్రారంభమై 25 రోజులు అవుతున్నా సెంటర్లు అందుబాటులోకి రాలేదు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సమన్వయం లోపించడంతో అసలు భారత్ రైస్ ఎక్కడ విక్రయిస్తున్నారో తెలియని దుస్థితి ఉన్నది. బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షించే పౌర సరఫరాల శాఖ అధికారులను కలిసి విచారిస్తే భారత్ రైస్కు సంబంధించిన విషయాలు తమకు తెలియదని చెబుతుండడంతో జిల్లా ప్రజలు బిక్కమొఖం వేస్తున్నారు. అసలు జిల్లా అధికారులకే సమాచారం లేకుండా, పథకం అమలు ఎలా సాధ్యమవుతుందంటూ మండిపడుతున్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగినయ్. బియ్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తున్నది. కేంద్రం భారత్ రైస్ 29కి ఇస్తామని చెప్పడంతో సంతోషపడ్డం. పథకం ప్రారంభమైన తర్వాత వారం నుంచి జగిత్యాల అంతా జల్లెడ పట్టినం. ఎంత తిరిగినా భారత్ రైస్ ఎక్కడ అమ్ముతున్నారో తెలువలేదు. అందరినీ అడిగాం. అంగన్వాడీ టీచర్ల నుంచి మొదలు పెట్టి, ఆఫీసర్ల దాకా అడిగినా మాకు తెలియదన్న సమాధానమే వచ్చింది. భారత్ రైస్ కోసం వెతికీ వెతికీ యాష్టకు వచ్చింది. ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే చౌక ధరల దుకాణంలోనే భారత్ రైస్ విక్రయాలు చేపట్టాలి. అంతేకానీ ఎక్కడ అమ్ముతున్నారో కూడా తెలియని విధంగా పెడితే ఎట్లా?
– మ్యాలపు శ్రీనివాస్, కార్పెంటర్ (జగిత్యాల)
భారత్ రైస్ ఎక్కడ విక్రయిస్తున్నారనే విషయంపై మాకు తెలియదు లేదు. ఆ పథకంపై మాకు ఎలాంటి సమచారం ప్రభుత్వం నుంచి అందలేదు. ఇక కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉన్నవి అన్న విషయం సైతం మాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ భండార్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్ లాంటి సంస్థలకు విక్రయ బాధ్యతలు ఇచ్చినట్లు పత్రికల్లో చూశాం. జగిత్యాల జిల్లాలో ఆయా కేంద్ర సంస్థలకు విక్రయ శాఖలు లేవు. ఉన్నతాధికారుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.
– వెంకటేశ్వర్రావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (జగిత్యాల)