కొత్తపెల్లి, జూన్ 27 : మండలంలోని ఏడు గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం గంగాధర మండలం ఆచంపల్లి శివారులోని వరదకాల్వ తూం వద్ద మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించే వంటావార్పు కార్యాక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు శనివారం ఆచంపల్లి వద్ద ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి, మాట్లాడారు. కాలువల ద్వారా సాగునీరు అందించాలని వారం గడువు విధించినప్పటికీ వారు స్పందించక పోవడంతో సర్కారు నిర్లక్ష్య వైఖరిపై మహాధర్నా, వంటావార్పుకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వరద కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయకపోవడంతో రైతులు నాట్లు సైతం వేసుకోలేదన్నారు. మరికొన్ని రోజులు ఇలానే ఉంటే పంట వేసే పరిస్థితి సైతం ఉండదన్నారు. తాను ఇటీవల కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామాన్ని సందర్శించి.. కాలువల ద్వారా సాగునీరు అందించాలని వారం గడువు విధించినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో మహా ధర్నాతోపాటు వంటావార్పు చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలుపుతామన్నారు. ధర్నాకు ఏడు గ్రామాల రైతులతోపాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మారెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ వైస్ చైర్మన్ రాజశేఖర్, నాయకుడు లకాకుల మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.