కరీంనగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు తమ వాహనాలను నిలిపివేసి కదం తొక్కారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, మండలకేంద్రాల్లో ప్లకార్డులు పట్టుకుని ధర్నా, రాస్తారోకోలు చేశారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ నిరసనలు తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని, తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలకు 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి డ్రైవర్కు నెలకు 15వేలు జీవనభృతి కల్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.