కార్పొరేషన్, మే 19: కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ నెల 31న నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి రావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కలిసి ఆహ్వానించారు. తిరుమలలో శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కరీంనగర్లో నిర్మించే టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించే అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయం, మూలవిరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం నమూనాలను పరిశీలించారు. తర్వాత హైదరాబాద్ టీటీడీ స్థానిక సలహామండలి అధ్యక్షుడు భాస్కర్ రావుతో కలిసి టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవీ ధర్మారెడ్డితో సమావేశమయ్యారు.
టీటీడీ ఆలయాన్ని చక్కగా నిర్మించాలని కోరారు. భూమిపూజకు ముందుగా ఈ నెల 22న టీటీడీ అర్చకులు భూకర్షణం (గర్భాలయ స్థలాన్ని నాగలితో దున్ని, నవధాన్యాలు చల్లి, మొలకెత్తిన తర్వాత గోవులకు ఆహారంగా వినియోగిస్తారు) కార్యక్రమం నిర్వహిస్తారని ఈవో తెలిపారు. ఆ తర్వాత చదును స్థలాన్ని చేసి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని చెప్పారు. 31వ తేదీన భూమిపూజ ముగిశాక అదే ప్రాంగణంలో సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో జేఈవోలు సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీనాగేశ్వర రావు, ఈఈ శ్రీ నరసింహమూర్తి, ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి: వినోద్కుమార్
ఈ నెల 31న కరీంనగర్లో నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ భూమిపూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలతో కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఈ బృహత్ కార్యక్రమం జరుగనున్నదని చెప్పారు. కరీంనగర్లో ఈ ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలకవర్గ సభ్యులు జీ భాస్కర్ రావు, డీ దామోదర్రావు (రాజ్యసభ సభ్యుడు) ఎంతో కృషి చేశారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.