హుజూరాబాద్/వీణవంక, జూలై 18 : దళితబంధు పథకం దళితుల తలరాతల్ని మారుస్తున్నది. తరతరాలుగా దుర్భర జీవితాలను గడుపుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. నాడు చాలీచాలని సంపాదనతో కాలం వెల్లదీసిన వారు నేడు దళితబంధు ద్వారా తమ కలల్ని నిజం చేసుకుంటున్నారు. అనుభవమున్న యూనిట్లను ఎంపిక చేసుకొని గతంకంటే రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. దళితబంధు ద్వారా తమ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్న పలువురు లబ్ధిదారులపై నమస్తే ప్రత్యేక కథనం..
నాడు ఆటో డ్రైవర్.. నేడు ట్రక్కు ఓనర్
.. ఈ ఫొటోలో ఉన్నది హుజూరాబాద్ మండలం చెల్పూర్కు చెందిన శనిగరం కుమార్. ఇద్దరు కొడుకులుండగా పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు. ఇంటి స్థలం మినహా ఎలాంటి ఆస్తులు లేవు. ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించేవాడు. ఆటో పాతది కావడంతో రోజంతా సంపాదించిన రొక్కం రిపేరుకే పోయేది. మినీ ట్రక్కు కొనాలన్న ఆశ ఉన్నా చేతిలో చిల్లి గవ్వ లేదు. అప్పు చేద్దామనే ధైర్యం అంతకన్నా లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చీకట్లో చిరుదివ్వెలా దళితబంధు వచ్చింది. ఈ పథకం కింద వచ్చిన రూ.10లక్షలతో మినీ ట్రక్కు (బొలెరో) కొనుక్కొని కలను సాకారం చేసుకున్నాడు. నెలకు రూ.30వేలకు పైగా సంపాదిస్తున్నాడు.
కేసీఆర్ దయతో ట్రక్కుకు ఓనర్నయిన
కేసీఆర్ సార్ దయతో ట్రక్కుకు ఓనర్నయిన. దళితబంధు లేకుంటే జీవితంలో ట్రక్కు కొనకపోతును. పాత ఆటోతో బాగా ఇబ్బందులు పడ్డ. ట్రక్కు చేతికి వచ్చినప్పటినుంచి సంతోషంగా బతుకుతున్న. చేతి నిండా పని దొరుకుతున్నది. కేసీఆర్ సార్కు ఎప్పటికీ రుణపడి ఉంట. రోజూ ఇంటికి డబ్బులు తీసుకొని పోతుంటే సంబురమనిపిస్తున్నది.
– శనిగరం కుమార్, చెల్పూర్ (హుజూరాబాద్ మండలం)
ఆటో నుంచి.. షూమార్ట్ శంకర్గా..
ఈ షూమార్ట్లో ఓనర్ సీట్లో కూర్చున్నది మామిడాలపల్లికి చెందిన దాసారపు కవిత-శంకర్ దంపతులు. శంకర్ మొన్నటి వరకు ఆటో నడుపుకొని వచ్చిన చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడ్డాడు. భార్య కవిత కూలీ పనులకు వెళ్లి అంతో ఇంతో తెచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పురాలేదు. కుటుంబ పోషణ, ఇద్దరు పిల్లల చదువు భారమైంది. పైగా ఆటో కోసం తెచ్చిన అప్పు తీరనే లేదు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. షూమార్ట్ యూనిట్కు దరఖాస్తు చేసుకున్నారు. 15 రోజుల్లోనే అధికారులు గ్రౌండింగ్ చేసి యూనిట్ను అందించారు. ఉన్న ఊళ్లోనే శంకర్ ‘ఢిల్లీ ఫుట్వేర్ అండ్ షూమార్ట్’ పేరిట షాప్ పెట్టుకున్నాడు. వ్యాపారం బాగా సాగుతున్నది. ఆటో నడుపుతూ రోజుకు రూ.300 కూడా రాక ఎన్నో ఇబ్బందులు పడ్డ శంకర్ నేడు తన షూమార్ట్ ద్వారా రోజుకు రూ.3వేలు సంపాదిస్తున్నాడు. ఆటో శంకర్గా ముద్రపడిన అతడు షూమార్ట్ శంకర్గా మారినందుకు గర్వ పడుతున్నాడు. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నామని శంకర్ దంపతులిద్దరూ సంబురంగా చెబుతున్నారు.
కలల గూడా అనుకోలేదు
రోజంతా ఆటో నడిపినా రూ.300లే అచ్చేది. అప్పుల కిందికి ఉన్న 20 గుంటలు అమ్ముడువోతదనుకున్న. గతంలో ఏ నాయకుడూ పట్టించుకోలేదు. సుట్టాలెవ్వలూ సాయంజేయలె. కేసీఆర్ సార్ దేవుని లెక్క దళితబంధు తెచ్చిండు. రూ.10 లక్షలు ఇచ్చిన్రు. ఊళ్లెనే చెప్పుల షాప్ పెట్టుకున్న. రోజుకు రూ.3వేల గిరాకీ ఐతంది. ఆటో శంకర్ అని పిలిచెటోళ్లంతా ఇప్పుడు షూమార్ట్ శంకర్ అని పిలుస్తుంటే సంబురమనిపిస్తున్నది. గింతసాయం జేసిన సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– దాసారపు కవిత-శంకర్, మామిడాలపలి, (వీణవంక మండలం)