కరీంనగర్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ‘దళితబంధు’ను తెచ్చింది. మొదటి విడుత 50 శాతానికిపైగా యూనిట్లు అందించి, విజయవంతంగా చెల్లింపులు చేస్తూ వచ్చింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల తర్వాత పథకం యథాతథంగా అమలవుతుందని ఆశించిన లబ్ధిదారులకు నిరాశే మిగులుతున్నది. కొత్త సర్కారు అధికారంలోకి వచ్చి దాదాపు నెల అవుతున్నా.. ఇప్పటివరకు పంపిణీపై ఎలాంటి స్పష్టత లేకపోవడం అయోమయానికి గురి చేస్తున్నది. అధికారులను అడిగినా సరైన సమాధానం రాక ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే దళితబంధు అమలవుతుందా..? లేదా..? అనే దానిపై సందిగ్ధం నెలకొనగా, పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాయం అందక తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని దళితకుటుంబాలు వాపోతున్నాయి. పథకాన్ని కొనసాగించి ప్రభుత్వం తమను ఆదుకోవాలనే డిమాండ్లు వ్యక్తం చేస్తున్నాయి.
దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. 2021 ఆగస్టు 15న హుజూరాబాద్ మండలం ఇందిరానగర్-శాలపల్లి వేదికగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అప్పటి సర్కారు ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించింది. హుజూరాబాద్ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, పథకం అమలు చేసింది. ఈ నియోజకవర్గంలో 18,021 మందికి లబ్ధి చేకూరింది. ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో రెండు విడుతల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. హుజూరాబాద్ మినహా ఉమ్మడి జిల్లా పరిధిలో 1,020 మందికి వివిధ యూనిట్లు మంజూరు చేసింది. లబ్ధిదారులు వివిధ రంగాలను ఎంచుకుని వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించింది. అయితే పథకం అమలుకు యూనిట్లను డెయిరీ, తయారీ, రిటైల్, సేవలు/సరఫరా, రవాణా సెక్టార్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కు 10 లక్షలు మంజూరు చేసి, అందులో 10వేలు దళిత రక్షణ నిధి కింద తీసుకుని మిగతా 9.90 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. అయితే కొన్ని సెక్టార్లలో లబ్ధిదారులు ఇచ్చిన కొటేషన్లను బట్టి ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 9.50 లక్షలు ఆపైన విడుదల చేశారు. వీటితో దళితులు వ్యాపారాలు చేసుకుంటున్నారు.
మిగిలిన సహాయంపై సందిగ్ధత
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు పథకంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తమ ఖాతాల్లో ఉన్న మిగిలిన ఆర్థిక సహాయాన్ని విడిపించుకునే అవకాశం ఇవ్వాలని లబ్ధిదారులు అడుగుతున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే పూర్తి కాగా, అందుకు అవసరమైన ఫొటో క్యాప్చరింగ్తోపాటు అదనపు కొటేషన్లు కూడా అధికారులు తీసుకున్నారు. కొన్ని క్లస్టర్ అధికారుల వద్ద, మరికొన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. 5లక్షల నుంచి 7,8 లక్షల వరకు ఆర్థిక సహాయం అందాల్సిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్లో 6,868 మందికి 256.76 కోట్లు రావాల్సి ఉంది. ఇదే నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మరో 1,280 మందికి 14.83 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కరీంనగర్లో 210 మందిలో 4, పెద్దపల్లిలో 259 మందిలో మరో 14, సిరిసిల్లలో 206 మందిలో 55, జగిత్యాలలో 345 మందిలో మరో 24 మందికి మిగిలిన ఆర్థిక సహాయం అందాల్సి ఉన్నది. కమలాపూర్ మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో 6,965 మందికి 258.67 కోట్లు రావాల్సి ఉంది. ఈ ఆర్థిక సహాయం అందుతుందా..? లేదా..? అనే విషయంలో లబ్ధిదారులు సందిగ్ధంలో పడ్డారు.
ఆందోళనలో లబ్ధిదారులు
దళితబంధు లబ్ధిదారులు 9.90 లక్షలతో తమ వ్యాపార ప్రణాళికలు చేసుకున్నారు. మొదట సాయం అందడంతో వ్యాపారాలు ప్రారంభించారు. ఇప్పుడు మిగిలిన ఆర్థిక సహాయం అందక ఆందోళన చెందుతున్నారు. వీరిలో ఎక్కువగా రిటైల్, రవాణా రంగాలకు సంబంధించిన వారే ఉన్నారు. దుకాణాల్లో సరుకులు నిలిచి పోవడం, తిరిగి తెచ్చుకునే విషయంలో డబ్బులు రొటేషన్ కాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతూ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అసలు మిగిలిన డబ్బులు వస్తాయా..? రావా..? అని సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దళితులు రోడ్డెక్కుతున్నారు. ఇటీవల జమ్మికుంట తహసీల్ ఆఫీస్ ఎదుట లబ్ధిదారులు ఆందోళన చేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన హుజూరాబాద్లో పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
లబ్ధిదారులకు న్యాయం జేయాలె
కూలీనాలి జేసుకొనే మా బతుకుల్ల దళితబంధు ఇచ్చి కేసీఆర్ వెలుగులు నింపిండు. అధికారులు ఆరు నెలల కిందట మొదటి విడుత 5లక్షలు ఖాతాలో జమ జేసిన్రు. ఈ నగదుతో జమ్మికుంటలోని కాళోజీ రోడ్డులో ఓ షెట్టర్ను అద్దెకు తీసుకొని కంగన్హాల్ అండ్ జనరల్ స్టోర్ పెట్టుకున్న. గిరాకీ గూడా మంచిగైతున్నది. నలుగు పైసలు కండ్ల జూత్తున్నం. రెండో విడుత డబ్బులు చేతికి వచ్చే టైంల ఎలక్షన్ కోడ్ వచ్చింది. దీంతో నగదు విడుదల కాలేదు. ఎన్నికల తర్వాత సంది ఆఫీసుల చుట్టూ తిరిగినా లాభంలేకుండా పోయింది. కొత్త సర్కారు దళితబంధు కింద సాయం జేత్తదని అనుకున్న. కానీ, గవర్నమెంట్ అచ్చి దగ్గర దగ్గర నెల అయింది. అధికారుల దగ్గరికి పోతే పట్టించుకుంటలేరు. ప్రభుత్వం దళితబంధుపై దృష్టిపెట్టి లబ్ధిదారులకు న్యాయం జేయాలె.
– తిప్పారపు లక్ష్మి, దళితబంధు లబ్ధిదారు, కనపర్తి, (వీణవంక)
ముందుకుసాగని వ్యాపారం
వీణవంకకు చెందిన ఇతని పేరు దాసారపు స్వామి (శ్యాం). దళితబంధు మొదటి విడత కింద ఇచ్చిన 5 లక్షలతో కుట్టు మిషన్ల సేల్స్ అండ్ రిపేర్ షాపు పెట్టుకున్నాడు. తనకు వచ్చిన మొత్తం నుంచి 84 మిషన్లు తెచ్చి విక్రయించాడు. అందులో ఎక్కువగా ఉద్దెర కిందనే విక్రయించాల్సి వచ్చింది. ఇపుడు అమ్మడానికి రెండు మిషన్లు మాత్రమే మిగిలినయ్. మిగతా 4.90 లక్షలు వస్తాయనే ఆశతో గోదాం ఉండాలని తాను అద్దెకు ఉన్న ఇంటిని విస్తరించుకున్నడు. కానీ, ఇప్పటివరకు మిగిలిన మొత్తం రాలేదు. చేతిలో డబ్బులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి రావల్సిన డబ్బులు రాకపోవడంతో స్వామి వ్యాపారం దెబ్బతిన్నది. మిగిలిన డబ్బులు వస్తాయనే ఆశతో తాను అద్దెకు తీసుకున్న ఇంటికి నెలకు 2,500, కరెంట్ బిల్లు మరో 500 చెల్లిస్తూ వస్తున్నడు. ఇపుడు ఆ మిగిన డబ్బులు వస్తాయనే ఆశ రోజురోజుకూ సన్నగిల్లుతున్నదని స్వామి వాపోతున్నాడు. తన ఫైల్ ఈడీ కార్యాలయంలో పెండింగ్లో ఉందని, వెంటనే మిగిలిన డబ్బులు విడుదల చేయాలని కోరుతున్నాడు.
షాపుల సామాను లేదు.. ఏంజేయాలో అర్థమయితలేదు
పది నెలల కిందట నాకు దళితబంధు కింద 5లక్షలు మంజూరు చేసిన్రు. జమ్మికుంటలో మొబైల్షాప్ పెట్టుకున్న. ఫర్నిచర్ కొనుగోలు చేసి మిగిలిన డబ్బులతో ఫోన్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసి విక్రయిస్తున్న. రెండో విడుత డబ్బులు చేతికందే టైంల ఎన్నికల కోడ్ అచ్చింది. ఎలక్షన్లు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. వారం పదిరోజుల్ల పైసలు విడుదల జేత్తరని అనుకున్న. కానీ, అధికారుల దగ్గరికి వెళ్లి సరైన సమాధానం ఇవ్వడంలేదు. షాపులో సామాను లేక గిరాకీ మర్రిపోతున్నది. ప్రతి నెలా 15 వేల కిరాయి మీదవడుతంది. ఏంజేయాలో అర్థమయితలేదు! ప్రభుత్వం వెంటనే దళితబంధు డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలె.
– దాసారపు నాగరాజు, దళితబంధు లబ్ధిదారుడు (వీణవంక)
వ్యాపారం విస్తరణ కోసం ఎదురుచూపు
ఇక్కడ కూర్చున్న వారి పేరు తాండ్ర శంకర్, కత్తెరపాక శంకరయ్య. వీరిది వీణవంక మండలం చల్లూరు. అప్పుడు ఇద్దరికి కలిపి 10 లక్షలు రాగా, ఒక ఫర్మ్ ఏర్పాటు చేసుకుని చల్లూరులోనే ఆటో మోబైల్ షాపు పెట్టుకున్నారు. 2022 సెప్టెంబర్లో యూనిట్ ప్రారంభించుకున్నారు. వ్యాపారంలో వచ్చిన లాభాల నుంచి పైసా పైసా కూడేసుకుని జిరాక్స్ సెంటర్ కూడా పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిగిలిన 9.80 లక్షల కోసం అదనపు కొటేషన్తోపాటు మిగిన ప్రక్రియ పూర్తి చేశారు. ఈ ఫైల్ ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయానికి వెళ్లింది. ఇక డబ్బులు వస్తాయనుకునే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో వీళ్లు తీవ్ర నిరాశ చెందారు. అప్పుడు అధికారులను అడిగితే ఎన్నికల తర్వాత వస్తాయని చెప్పారు. ఇప్పుడు అడిగితే ప్రభుత్వం ఆదేశాలు రాలేదని అంటున్నారు. ‘బ్యాంకు ఖాతాల్లో ఉన్న మా డబ్బులు మాకు ఇచ్చేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. మానవతా దృక్పథంతోనైనా గత ప్రభుత్వం చేసిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించాలి’ అని వేడుకుంటున్నారు.