హుజూరాబాద్, డిసెంబర్ 28: దళితులంతా దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సూచించారు. బుధవారం పట్టణంలో దళితబంధు లబ్ధిదారులు అందే తిరుపతి, ఎర్ర విజయ, బోరాగల జయ ఏర్పాటు చేసుకున్న మెడికల్ ఏజెన్సీ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. లబ్ధిదారులు మంజూరైన యూనిట్లను సక్రమంగా నిర్వహిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. దళితులు ధనికులు కావాలని ఆకాంక్షించారు. గత పాలకులు దళితులను ఓటుబ్యాంకుగా చూశారే తప్ప వాళ్ల సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకొన్న దాఖలాలు లేవని విమర్శించారు. అన్ని వర్గాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, నాయకులు ఇమ్రాన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
దళితబంధు యూనిట్ల పరిశీలన
మండలంలోని చల్లూరు గ్రామంలో దళితబంధు పథకం కింద మొదటి విడుత మంజూరైన యూనిట్లను బుధవారం డీఆర్డీవో శ్రీలత పరిశీలించారు. లబ్ధిదారులకు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ ఉపాధిహామీ పథకంలో చేసిన పనులు, బృహత్ పల్లెప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దళితబంధు పథకంలో మంజూరైన ప్రతి యూనిట్ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ దళితులు ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండేలా కష్టపడి వ్యాపార వేత్తలుగా ఎదగాలని సూచించారు. పల్లెప్రగతి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే శ్రీనివాస్, ఏపీవో స్వామి తదితరులు పాల్గొన్నారు.