అది గంగాధర మండలం ర్యాలపల్లిలోని దాసవోని గుట్టబోరు.. రెండేండ్ల కింది వరకు పదునుదేలిన పలుగురాళ్లతో ఎడారిగా దర్శనమిచ్చింది. కానీ, నేడు పచ్చని వనమైంది. ఎటు చూసినా ఏపుగా పెరిగిన మొక్కలతో నందనవనాన్ని తలపిస్తున్నది. కృషితోనాస్తి దుర్భిక్షం అన్న సూక్తి స్ఫూర్తితో పంచాయతీ పాలకవర్గం కదిలింది. హరితహారంలో భాగంగా గుట్టపై 16 ఎకరాల విస్తీర్ణంలో 14 వేల మొక్కలు నాటి బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దింది. ఒక్కప్పుడు కనీసం పక్షివాలని ఈ గుట,్ట ఇప్పుడు పచ్చని చెట్లతో ప్రకృతి అందాలకు నిలయంగా మారింది.
గంగాధర, మార్చి 30: హరితహారంలో భాగంగా గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న సర్కారు భూముల్లో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ర్యాలపల్లిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 483లో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. 2021 ఆగస్టు 8న ప్రభుత్వ భూమిలో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను ప్రారంభించారు. అధికారుల ప్రోత్సాహంతో మొదటగా 2.50లక్షల పంచాయతీ నిధులను వెచ్చించి గుట్టపై అడ్డదిడ్డంగా ఉన్న రాళ్లను తొలగించి మైదానంగా మార్చారు. తర్వాత విడుతల వారీగా ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో మరింత ఉత్సాహంగా పని చేస్తూ 44 లక్షల 60 వేలతో సర్వాంగ సుందరంగా బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. వనంలో మొక్కలు నాటడంతో పాటు నీటి సౌకర్యం కల్పించడం, పైపులైన్లు వేయడం, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. ప్రకృతి వనం వద్ద వాచర్ను ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపట్టడంతో ఏడాదిన్నరలో మొక్కలు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి.
ర్యాలపల్లి గ్రామ దాసవోని గుట్టబోరు ఒకప్పుడు పదును దేలిన పలుగురాళ్ల బోరు. మచ్చుకు కూడా మొక్కలు కనిపించక ఎడారిని తలపించేది. కనీసం పక్షులు, పశువులు ఈ బోరువైపునకు రాకపోయేవి. కానీ, నేడు ఆ గుట్ట పచ్చని వనంలా మారింది. అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు చేయిచేయి కలిపారు. హరితహారంలో భాగంగా బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. వేలాది మొక్కలను నాటి కంటికి రెప్పలా కాపాడారు. దాంతో రెండేళ్లలోనే పచ్చగా మారింది. ప్రస్తుతం ఎటుచూసినా ఆహ్లాదకరవాతావరణం కనిపిస్తున్నది.
16 ఎకరాలు.. 14వేల మొక్కలు
ఇక్కడి బృహత్ ప్రకృతి వనంలో పంచాయతీ స భ్యులు, అధికారులు గ్రా మస్తుల సహకారంతో 14,030 మొక్కలు నాటారు. అందులో జామ 3060, దానిమ్మ 2వేలు, అల్లనేరేడు 1800, ఉసిరి 500, నిమ్మ 200, వెలగ 320, వేప 200, చింత వెయ్యి, నారవేప 100, మామిడి 230, బాదం 400, పులిచింత 500, సీతాఫలం 1100, ఖర్జూర 290, తాని 250, మహాగని 1800, తెల్లమద్ది 280 మొక్కలు నాటారు. అలాగే వివిధ రకాల పూల మొక్కలను నాటారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు చేపట్టారు. మొక్కలకు నీళ్లు పట్టేందుకు పైపులైన్లు వేశారు. మధ్య మధ్యలో స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. దాంతో మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి. పచ్చని హారంగా మారిన దాసనోని బోరు కనువిందు చేయడమే కాకుండా కోతుల వంటి జీవులకు ఆహార ప్రదేశంగా కూడా మారింది.
అందరి సహకారంతో వనం
మా ర్యాలపల్లి గ్రామం చుట్టూ పెదపెద్ద గుట్టలు ఉన్నాయి. గుట్టల మధ్య ఉన్న ప్రభుత్వ భూమి పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా ఉండేది. హరితహారంలో భాగంగా బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం దాసనోని బోరుకు 16 ఎకరాల భూమిని గుర్తించాం. అధికారుల, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంలో 16 ఎకరాల్లోని రాళ్లను తొలగించి చదును చేయించి 14 వేల మొక్కలను నాటాం. వాటిని సంరక్షించడంతో ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
– పానుగంటి లక్ష్మీనారాయణ, సర్పంచ్
మొక్కలతో ఆహ్లాదం..
ఏడాదిన్నర క్రితం వరకు దాసనోని బోరు అంటే మొక్కలు మొలువని పెద్ద పెద్ద రాళ్లతో ఉన్న ప్రదేశం. ఎటు చూసినా ఎడారిగా కనిపించేది. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకతి వనాలను ఏర్పాటు చేస్తుండడంతో అధికారులతో కలిసి దాసనోని బోరు వద్ద వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వనంలో నాటిన పండ్ల మొక్కలు ఏపుగా పెరిగి కాతదశలో ఉన్నాయి. రానున్న రోజుల్లో వనం గ్రామ పంచాయతీకి ఆదాయవనరుగా మారుతుంది. ఇంత గొప్ప ఆలోచన చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– అట్ల రాజిరెడ్డి, ఎంపీటీసీ (ర్యాలపల్లి)