ధర్మపురి, ఫిబ్రవరి 6: ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని గొల్లపల్లి, మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులాలు కొత్తరూపు సంతరించుకోనున్నవి. ఉమ్మడి పాలనలో కునారిల్లిన స్కూళ్లను పునరుద్ధరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కొప్పుల చొరవతో నాబార్డ్ ద్వారా 50 కోట్లు కేటాయించగా, ధర్మపురి పరిధిలోని ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 19 గురుకులాలను తీర్చిదిద్దాలని సంకల్పించింది.
అందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని గొల్లపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల భవన సముదాయ నిర్మాణానికి 17 కోట్లు కేటాయించారు. అలాగే ఈ పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తూ గురుకులాల ప్రభుత్వ కార్యదర్శి రాహూల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే భవన సముదాయ నిర్మాణానికి ఇప్పటికే గొల్లపల్లిలోని 735 సర్వే నంబర్లో 7 ఎకరాల స్థలాన్ని గుర్తించారు.
ఈ స్థలంలో 17 కోట్లతో ఆరు నుంచి 12 వరకు సకల సౌకర్యాలతో కూడిన తరగతి గదులు, డార్మెంటరీలు, డైనింగ్ హాల్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, మీటింగ్ హాల్, మరుగుదొడ్లను నిర్మించనున్నారు. గతేడాది వరకూ గొల్లపల్లిలోనే నిర్వహించబడిన సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ వర్షాలకు శిథిలావస్థకు చేరింది. మంత్రి ఈశ్వర్ స్పందించి గొల్లపల్లి నుంచి గురుకులాన్ని ధర్మపురి మండలం మగ్గిడిలో గల మైనార్టీ గురుకుల హాస్టల్ భవనానికి మార్చారు.
అలాగే ధర్మారం మండలం మల్లాపూర్ బాలికల గురుకుల కళాశాలలో రూ.కోటితో శిథిల భవనాలను తొలగించి నూతన భవనాల నిర్మాణం, ప్రయెగశాల, మరుగుదొడ్లను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా గురుకులాల అభివృద్దికి నిధులు మంజూరు చేయించిన మంత్రి ఈశ్వర్కు ధర్మపురి నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు.