సేద్యంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న రాష్ట్ర సర్కారు, సాగు వివరాల కోసం చేపట్టిన పంటల లెక్క తేలింది. రెండు నెలలుగా చేలలోనే ఏఈఓలు.. 57 బృందాలతో సర్వే పూర్తి జిల్లాలో చేసి ఈ వానకాలం సీజన్లో మొత్తం 2,33,856 ఎకరాల్లో పంటలు సాగువుతున్నట్లు స్పష్టం చేసింది. కాళేశ్వర జలాలు తరలిరావడం, విస్తారంగా వర్షాలు పడడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగగా, ఒక్క వరే 176,081 ఎకరాల్లో వేయగా, పత్తి విస్తీర్ణం తగ్గింది. కేవలం 54,113 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నట్లు యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం పంటల లెక్క పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. సాగులో రైతులకు మెళకువలు, అవగాహన కల్పించేందుకు 5వేల ఎకరాలకొక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించింది. పండించిన ధాన్యం రైతులు నేరుగా మార్కెటింగ్ చేసుకునేందుకు, సమావేశాలు పెట్టుకుని ధర నిర్ణయించుకునేందుకు వీలుగా క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించింది. సర్వే నంబర్లతో సహా పంటల సాగు వివరాల సేకరణకు శ్రీకారం చుట్టింది. పంటల లెక్క పక్కాగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించగా, రెండు నెలల కిందే వ్యవసాయ శాఖ రంగంలో దిగింది. జిల్లాలో 57 క్లస్టర్లు ఉండగా, 57 మంది ఏఈవోలు, అధికారులతో కూడిన 57 బృందాలను పంపించి వివరాల సేకరణ చేపట్టింది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలలోని 11 మండలాలు, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గంలోని బోయినిపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో కలుపుకుని మొత్తం పంటల వివరాలు క్షేత్ర స్థాయిలో నిర్వహించింది.
జిల్లాలో 2,33,856 ఎకరాల్లో సాగు
జిల్లాలోని 13 మండలాల్లో 2లక్షల 33వేల మంది రైతులు వివిధ రకాల పంటలు వేశారు. మొత్తం 233,856 ఎకరాలలో పంట సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ తన సర్వే ద్వారా లెక్కలు తేల్చింది. అందులో వరి 1,76,081 ఎకరాలు, పత్తి 54,113 ఎకరాలు, జొన్న 4.08 ఎకరాలు, మక్క 1,343 ఎకరాలు, కందులు 1,755 ఎకరాలు, బబ్బెర్లు 2,915 ఎకరాలు, కొర్రలు 0.19 ఎకరాలు, జనుము 2.20 ఎకరాలు, పల్లి 7.18 ఎకరాలలో పంటలు వేశారు.
పెరిగిన వరి.. తగ్గిన పత్తి
సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు నీటి సమస్య తీరిపోవడం, భారీ వర్షాలు పడడంతో మధ్య, ఎగువ మానేరు, అన్నపూర్ణ జలాశయాలకు జలకళవచ్చింది. జిల్లాలోని 13 మండలాల్లో 660 చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి. సమృద్ధిగా సాగునీరు లభించడంతో వ్యవసాయం పండగలా సాగుతున్న ది. గత వానకాలం కంటే ఈ వానకాలం వరి, పత్తి పంటలు రైతులు ఎక్కువగా సాగు చేశారు. గత వానకాలంలో వరి 1,13,300 ఎకరాలు సాగు చేయగా, ఈ సారి 1,76,081,11 ఎకరాల్లో వేశారు. పత్తి పంటను సగానికి తగ్గించారు. గత సీజన్లో 1,30,300 ఎకరాలు వేయగా, ఈ సారి 54,113 ఎకరాలు సగానికి పైగా తగ్గించేశారు.
ఉద్యాన పంటల సాగు 4,404 ఎకరాలు
జిల్లాలో ఉద్యాన పంటల సాగుపైన యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. 4620 మంది రైతులు వివిధ కూరగాయలు, పండ్ల పంటలు సాగు చేస్తున్నారు. 2,781 ఎకరాలలో 1043 మంది రైతులు వివిధ పండ్లను సాగు చేస్తుండగా, 1,623 ఎకరాలలో 3537 మంది కూరగాయలు సాగు చేస్తున్నారు. 672 ఎకరాలలో కూరగాయలు, 22 ఎకరాలలో బంతి, చేమంతి పూలసాగు చేస్తున్నారు. 372 మంది రైతులు 255 ఎకరాలలో సుగంధ ద్రవ్యాలను సాగు చేస్తున్నారు. 27 మంది రైతులు 42.23 ఎకరాలలో పట్టుపురుగుల (మల్బరీ) తోటలను సాగు చేస్తున్నారు. 360 మంది రైతులు 649 ఎకరాలలో ఆయిల్ పాం సాగు చేస్తున్నారు.
సన్న ధాన్యం సాగువైపు అన్నదాతలు
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం గతంలో కంటే రెండు రేట్లు పెరిగింది. అందులో సన్న బియ్యం సాగుపై అన్నదాతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. జైశ్రీరాంకు ఎక్కువ డిమాండ్ ఉన్నందున ఆ పంటలే ఎక్కువ శాతం సాగు చేస్తున్నారు. సన్నబియ్యం సాగు ఏటా పెరుగుతూ వస్తున్నది. రైతులు 5,020 ఎకరాల్లో సన్నబియ్యం సాగు చేశారు. అందులో జైశ్రీరాం, ఆమన్గోల్డ్, జేజీఎల్, బీపీ టీ, తెలంగాణ సోనా లాంటి సన్న రకాలు ఉన్నా యి. వినియోగదారులు ఎక్కువగా నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సన్న రకాలు ఇంకా పెరిగే అవకాశముం దని అధికారులు అంచనా వేస్తున్నారు.