Dharmaram | ధర్మారం, మే16 : అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వాటిపై పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఇప్పటికే మండలంలోని ఓ గ్రామంలో ప్రభుత్వ భూములను రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం ఆగమేఘాలపై నర్సింగాపూర్ గ్రామానికి తరలి వెళ్లి కొందరు అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.
నర్సింగాపూర్ గ్రామ శివారులోని సర్వే నెం.273 ప్రభుత్వ భూమి మొత్తం రక్బా 130 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులో ఉంది. ఆ సర్వే నంబర్ లో దాదాపు 59 ఎకరాల భూమి కాస్తులో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కాగా ఇంకా దాదాపు 48 ఎకరాల భూమి ని 23 మంది రైతులు అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా రెవెన్యూ రికార్డులలో నమోదు చేయించుకుని మొఖా పై సాగు చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో భూ ఆక్రమణ చట్టం-1905 ప్రకారం సదరు భూ ఆక్రమణ దారులకు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. రెవెన్యూ రికార్డు పరిశీలించగా వారు పొందిన పట్టాదారు హక్కులు చెల్లవని నిర్ధారించారు. దీంతో శనివారం స్థానిక తహసీల్దార్ దురిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కలిసి అక్రమిత భూములను పరిశీలించారు.
అక్రమంగా సాగు చేస్తున్న 48 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అట్టి భూమిని ఎక్స్ కవేటర్ల తో చదును చేయించి ‘ఇది ప్రభుత్వ భూమి-ఆక్రమణదారులు చట్టరీత్యా శిక్షార్హులు’ అని సూచించే బోర్డులు ఏర్పాటు చేయించినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర గ్రామాలలో కూడా ప్రభుత్వ భూములను అసైన్మెంట్ ఆమోదం లేకుండా పట్టా పొందిన భూములను స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు.