Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 9 : రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ జవహర్ నగర్ లో గల ఓ రేషన్ దుకాణంలో బియ్యం తూకంలో తరుగు తీస్తున్నారన్న ఆరోపణలపై గురువారం సివిల్ సప్లయ్ అధికారులు విచారణ దాగుడుమూతలు విధంగా సాగింది. మధ్యాహ్నం రేషన్ దుకాణంకు వచ్చిన సివిల్ సప్లయ్ అధికారులు షాపులోని కాంటాను పరిశీలించారు. ఆ తర్వాత లీగల్ మెట్రాలజీకి సమాచారం అందించారు.
అప్పటివరకు సివిల్ సప్లయ్ అధికారులు మాత్రం తామేం చేయలేమంటూ అక్కడే గల్లీలో కలియ తిరగడంతో విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో కార్డుదారుడికి తూకంలో 4 కిలోలు తరుగు తీస్తూ మోసం చేస్తున్నాడంటూ స్థానికులు సివిల్ సప్లయ్ అధికారులకు వివరించగా, లీగల్ మెట్రాలజీ అధికారులు వస్తేనే బయట పడుతుందనీ, అప్పటి వరకు ఇక్కడే వేచి ఉంటామని సర్దిచెప్పారు. కొద్దిసేపటికే రేషన్ డీలర్ల సంఘం నాయకులు, మధ్యవర్తులు చౌకధరల దుకాణం వద్దకు చేరుకొని అధికారులతో మంతనాలు సాగించారు. సుమారు 2 గంటల పాటు సాగిన విచారణ గందరగోళంకు దారితీసింది.
అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో స్థానికులు, ఫిర్యాదుదారులు అయోమయంకు గురయ్యారు. పత్రికలో కథనం రావడంతో అప్రమత్తమై కాంటాను సరి చేసి ఉంటారని స్థానికులు ఆరోపించారు. విచారణకు వచ్చిన సివిల్ సప్లయ్ అధికారులు కూడా ఏమి చేయాలో తెలియక ప్రక్కన గల్లీలోకి వెళ్లి ఓ ఇంటి వద్ద సేద తీరడం కనిపించింది. అప్పటికే మధ్యవర్తులతో డీలర్ తరఫున వ్యక్తులు జరిపిన మంతనాలు కొలిక్కివచ్చినట్లు తెలిసింది. మధ్యవర్తుల మంతనాలు ఫలించినట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టర్ స్వయంగా విచారణకు ఆదేశించాలని స్థానికులు పట్టుబట్టారు. లీగల్ మెట్రాలజీ సిబ్బంది రాకపోయేసరికి అందరూ ఇంటిదారి పట్టారు.