రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో చర్చ జరగాలని, పార్టీ కార్యకర్తలు గడపగడపకూ వివరించాలని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. వీణవంక మండలంలోని ఐలాబాద్-చల్లూరు గ్రామాల పరిధిలోని స్వర్ణలత ఫంక్షన్హాల్లో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీచైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్తో కలిసి మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఒక అన్నగా ఆపదలో ఉన్నవారి కన్నీటి బొట్టును తుడుస్తానన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం, బలగమని, రానున్న రోజుల్లో హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు.
వీణవంక, ఏప్రిల్ 5: ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఒక అన్నగా ఆపదలో ఉన్నవారి కన్నీటి బొట్టును తూడుస్తానని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసానిచ్చారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం, బలగం అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. వీణవంక మండలంలోని ఐలాబాద్-చల్లూరు గ్రామాల పరిధిలోని స్వర్ణలత ఫంక్షన్హాల్లో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీచైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్తో కలిసి మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నామన్నారు. కుటుంబంలో శుభకార్యం జరిగితే ఎలా ఆహ్వానిస్తామో.. అలాగే ప్రతి కార్యకర్తనూ బొట్టుపెట్టి మరీ ఆహ్వానించాలని కోరారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ గడ్డపై చూపిస్తున్న ప్రేమ, అభిమానం మరిచిపోలేనిదన్నారు. 2001లో తమ నాన్నగారు పాడి సాయినాథ్రెడ్డి సీఎం కేసీఆర్ను మామిడాపల్లి నుంచి వల్భాపూర్ వరకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారని, అందుకే చల్లూరు గడ్డపై నుంచే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించామన్నారు. రానున్న ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం కేసీఆర్ను అడిగానని చెప్పారు. అందుకు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, దళితబంధు వంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ హుజూరాబాద్ గడ్డపై తనకున్న ప్రేమను చాటుకున్నారన్నారన్నారు. ప్రతి కార్యకర్త ఆత్మవిమర్శ చేసుకోవాలని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ ముందు ధైర్యంగా అభివృద్ధి పనులు అడిగేలా పని చేయాలని సూచించారు. సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి హుజూరాబాద్లో ఎందుకు జరుగలేదో ప్రజలు ఆలోచన చేయాలని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై గ్రామాల్లో చర్చ జరగాలని సూచించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని, వాటిని ప్రజలకు అర్థమమ్యేలా కార్యకర్తలు వివరించాలని చెప్పారు. ప్రతి గ్రామానికి కోట్ల అభివృద్ధి పనులు చేయించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కృషితో 30 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు, 2.40 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కళ్లకు కట్టినట్టు కనబడుతుందని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నదా..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశమివ్వాలని, మరో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్లో జరిగిన అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తనను గౌరవించి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని, ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. అనంతరం గంగారం గ్రామంలో రామాలయ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి, మాజీ సింగిల్విండో చైర్మన్ గంగాడి తిరుపతిరెడ్డి, చల్లూరు సర్పంచ్ పొదిల జ్యోతి రమేశ్ పాల్గొన్నారు.
హుజూరాబాద్ గడ్డ చైతన్యవంతమైన గడ్డ. ఏ అభివృద్ది చేయడం చేతకాని బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను బీఆర్ఎప్ కార్యకర్తలు తిప్పికొట్టాలి. హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ బొమ్మను గెలిపించిన ఘనత బీఆర్ఎస్ కార్యకర్తలది. ఎన్నో మంచి పథకాలను ప్రారంభించడానికి వేదికైన ఈ గడ్డ నుంచి గులాబీ జెండా ఎగురడానికి కృషి చేయాలి. గులాబీ నాయకుడికి కృతజ్ఞతగా ఎమ్మెల్యేను గెలిపించాలి. బీజేపీ చిల్లర నాయకుల మాటలు నమ్మి యువత మోసపోవద్దు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్ళకు కట్టేలా ప్రతీ ఒక్కరికీ వివరించాలి. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు నాయకత్వంలో బీఆర్ఎస్ ఎంతో బలంగా ఉంది.
-పొన్నం అనిల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
బండి సంజయ్ తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నడు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రం లీకైందంటూ బండి సంజయ్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నడు. ఈ లీక్ చేసింది కరీంనగర్ జిల్లాలో ఏబీవీపీ నాయకుడిగా పని చేసిన ఆయన మనిషే. పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈటల రాజేందర్ పీఏ కూడా సోషల్ మీడియాలో పేపర్ లీకేజీపై పోస్టులు పెడుతున్నడు. ఏ స్నేహితుడి నుంచి నీకు పేపర్ లీకేజీ సమాచారం వచ్చిందో బయట పెట్టాలి. హుజూరాబాద్ నియోజకవర్గంలో తట్టెడు మట్టి కూడా పోయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ను విమర్శించడం సిగ్గుచేటు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో దేశ ప్రజలు గమనిస్తున్నరు. బీజేపీ బ్రోకర్ మాటలను బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలి. బండి సంజయ్ సీఎం కేసీఆర్తో పోటీ అనడం సిగ్గుచేటు. పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలి. ఎవరిని చూసుకొని బీజేపీ పార్టీ ఎగురుతుందో ఆ బండి సంజయ్కి కరీంనగర్లో, ఈటల రాజేందర్కు హుజూరాబాద్లో డిపాజిట్ కూడా రాదు.
– పాడి కౌశిక్రెడ్డి, మండలి విప్
పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయాలు, వర్గాలు లేవు. అందరూ కలిసికట్టుగా పని చేయాలి. మనందరిదీ ఒకే కుటుంబం. అదే బీఆర్ఎస్ పార్టీ కుటుంబం. ఐలాబాద్-చల్లూరు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలిరావడం సంతోషకరం. ఇదే ఉత్సాహాన్ని రాబోయే ఎన్నికల్లో చూపిం చి హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడానికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హుజూరాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించింది. మరింత అభివృద్ధి జరుగాలంటే సీఎం కేసీఆర్ సూచించిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. అభివృద్ధి చేతకాని నాయకులు ఎన్నో మాట్లాడుతారు, వాటన్నిటినీ సైనికుల్లా తిప్పికొట్టాలి. కరీంనగర్లోనే హుజూరాబాద్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. గొప్ప గొప్ప పథకాలన్నీ ఈ గడ్డ నుంచే ప్రారంభమయ్యాయి. పార్టీలో కష్టపడేవారికి సముచిత స్థానం దక్కుతుంది. దానికి ఎస్సీ కార్పొరేషన్, టూరిజం కార్పొరేషన్, ప్రభుత్వ విప్ పదవులే నిదర్శనం.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకోవడానికే సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి. కార్యకర్తలకు ఎల్లవేళలా పార్టీకి అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలోనే మహిళలకు సముచిత స్థానం దక్కుతుంది. సీఎం కేసీఆర్ కృషితో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. చదువులు మానేసి పార్టీలో తిరగమని బీజేపీ నాయకుడు బండి సంజయ్ చెబుతున్న మాటలు అందరికీ తెలిసిందే. బీజేపీ మాయలో యువకులు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.
– కనుమల్ల విజయ, జడ్పీచైర్పర్సన్
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్న బీఆర్ఎస్ పార్టీతోనే మండలం గణనీయమైన అభివృద్ధి సాధించింది. రాష్ట్రంలో జరుగుతన్న అభివృద్ధిని చూడలేని బీజేపీ నాయకులు బూటకపు మాటలతో పూటలు గడుపుకుంటున్నారు. అధికారంలోకి రావడానికి దొడ్డిదారి వెతుకుంటున్నారు. ప్రతి కార్యకర్త మంచి సంకల్పంతో పార్టీ కోసం పని చేయాలి. ఎన్ని అవరోధాలు వచ్చినా పార్టీని విడిచిపోవద్దు. కార్యకర్తలకు అండగా ఉంటాం .
– ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి
దేశంలో రైతుల గురించి ఆలోచించే నాయకుడు ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే. ఒకప్పుడు రైతులకు నీళ్లు లేక, కరెంట్ లేక , మోటార్లు కాలిపోయి ఎన్ని కష్టాలు పడ్డారో కళ్లారా చూసిన నాయకుడు కాబట్టి రైతులకు 24 గంటల కరెంట్, సమృద్ధిగా నీళ్లు, రైతుబంధు, రైతుబీమా అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో కళ్లారా చూస్తున్నాం. సీఎం కేసీఆర్ పథకాలతో నేడు తెలంగాణ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంది. రైతులకు వ్యవసాయం ఒక పండుగలా మరింది. ప్రైవేట్ ఉద్యోగాలు మాని గ్రామాలకు చేరి వ్యవసాయం చేసుకుంటున్నారంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలే.
– మాడ సాధవరెడ్డి, మాజీ సింగిల్విండో చైర్మన్