చిగురుమామిడి, జనవరి 23: అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిదా అన్నారు. జ్వర సర్వేలో భాగంగా మండలంలోని ములనూర్, ముదిమాణిక్యం, ఇందుర్తి గ్రామాల్లో సర్వేను ఆదివారం పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొదటి డోసు పూర్తయిన వారు రెండో డోసు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాసు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. గ్రామాల్లో జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి పూర్తి వివరాలు నమోదు చేయాలని సర్వే సిబ్బందిని ఆదేశించారు. వైద్య సిబ్బందికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. జ్వర లక్షణాలున్నవారు వైద్య సిబ్బంది ఇచ్చిన మందులు వాడాలన్నారు. ప్రతి గ్రామంలో పకడ్బందీగా సర్వే చేయాలని సర్వే సిబ్బందికి సూచించారు. వీరి వెంట మండల వైద్యాధికారి నాగశేఖర్, ఎంపీవో శ్రావణ్ కుమార్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
కొనసాగుతున్న ఇంటింటి జ్వర సర్వే
లక్ష్మీపూర్(వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబానీ ఆధ్వర్యంలో ఆదివారం 64 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. లక్ష్మీపూర్, వెల్ది, వేగురుపల్లి, పచ్చునూర్, ఊటూర్, రంగపేట, జగ్గయ్యపల్లి, లింగాపూర్ గ్రామాల్లో 76 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు అన్నపూర్ణ, ఎండీ జుబేర్, ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్ ఎండీ ఇజాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
విస్తృతంగా సర్వే..
పట్టణంలో 24 టీంలు ఆదివారం 960 ఇండ్లకు వెళ్లి 3172 మందికి ఫీవర్ పరీక్షలు చేశారు. 7 ఇండ్లలో జ్వర పీడితులను గుర్తించి కిట్లు అందజేశారు. 21 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ రాగా మెడికల్ కిట్లు అందజేశారు. ఐదుగురికి మొదటి డోస్ టీకాలు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కౌన్సిలర్లు, హెచ్ఈవో వెంకటేశం, పీహెచ్ఎన్ హెల్త్ సూపర్వైజర్ నిర్మలాజ్యోతి, హెల్త్ అసిస్టెంట్లు ఏ పద్మ, వసంత, సౌందర్య, వజ్ర, వనిత, రేణుక, శోభతోపాటు ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.
మూడోరోజు కొనసాగిన జ్వర సర్వే
వావిలాల పీహెచ్సీ వైద్యుడు రఘపతి ఆధ్వర్యంలో అదివారం 27 బృందాలు1918 ఇండ్లల్లో జ్వర సర్వే చేశారు. 18 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి, మందులు పంపిణీ చేశారు. ఏఎన్ఎంలు, పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశకార్యకర్తలు తదితరులు ఉన్నారు.