జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 22: ‘కాంగ్రెస్ చెబుతున్నవి అన్నీ అబద్ధాలే. అధికారం కోసం దొంగహామీలిస్తున్నరు. రాష్ర్టాన్ని ఏండ్ల కొద్ది పాలించి పేదలకు రూపాయి సాయం చేయనోళ్లు.. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఇస్తామంటే ఎట్ల నమ్ముతరు. వాళ్లు ఏది ఇవ్వరు. ఏం చేయరు. నమ్మితే మోసపోతరు’ జాగ్రత్త అంటూ జగిత్యాల అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్కుమార్ ప్రజలకు సూచించారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపెల్లి, మోరపెల్లి, చల్గల్, చర్లపెల్లి, హస్నాబాద్ గ్రామాల్లో బుధవారం కార్నర్ మీటింగ్లు నిర్వహించి, మాట్లాడారు. నాడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణను నేడు దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరంటు సరఫరా, చెరువులకు పూర్వవైభవం తేవడంతో భూగర్భ జలమట్టం పెరిగిందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నేడు భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయన్నారు.
వరి కోతల సమయం కావడంతో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనపడుతున్నాయన్నారు. గతంలో తాటిపెల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువకు రైతులు మోటర్లు పెట్టుకొని పంటలకు నీరందించుకుంటే అధికారులు కరెంట్ కట్ చేశారని, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రంలోని ఏ కాలువకు రైతులు మోటర్లు పెట్టుకున్నా కరంటు కట్ చేయవద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్, బీజేపీల పాలనను చూశారని, వాళ్ల పాలనలో వ్యవసాయానికి కరంటు ఎలా ఇచ్చారో.. ఎన్ని కష్టాలు పడ్డారో గుర్తుంచుకోవాలని సూచించారు. వ్యవసాయానికి 3గంటల కరంటు సరిపోతుందని, 10హెచ్పీ మోటార్లు పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, మూడు గంటల కరంటు సరిపోతుందా..? 10హెచ్పీ మోటర్లు రైతులకు భారం కాదా..? ఒకసారి ఆలోచించాలన్నారు.
తానొక్కటే అడుగుతున్నానని, గతంలో భూములకు సాగు నీటి సిస్థు వసూలు చేసి కరంటు కోతలు విధించిన కాంగ్రెస్ కావాలా..? వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్ రూ.5వేలకు పెంచుతామని, దివ్యాంగులకు కూడా రూ.6వేలు చేస్తామని, సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రూ.3వేల భృతి, భూమిలేని నిరుపేదలకు రైతు బీమా తరహాలోనే రూ.5లక్షల ఉచిత బీమాను అందిస్తామని, రేషన్ ద్వారా సన్నబియ్యం, రూ. 400కే గ్యాస్ సిలిండర్ను అందిస్తామన్నారు.
హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే మళ్లీ ఓట్లు అడుగుతామన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని, రోడ్లు వేశామన్నారు. జగిత్యాల నుంచి కిష్టంపేట దాకా రోడ్డు బాకీ పడిందని, మళ్లీ గెలిపిస్తే వేయిస్తానన్నారు. కాగా, ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ మాజీ మంత్రి రాజేశంగౌడ్, బీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు దావ సురేష్, బీఆర్ఎస్ జగిత్యాల అర్బన్ మండలాధ్యక్షుడు సురేందర్రావు, సర్పంచులు బొల్ల సత్తమ్మ, ఎల్ల గంగనర్సు, నాడెం రత్నమాల, లక్ష్మణ్రావు, తిరుపతి, ప్యాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆసిఫ్ ఉన్నారు.