Khammampally bridge | మంథని, జూలై 2 : దశాబ్దాలుగా కనీస రవాణా సౌకర్యం లేక అవస్థలు పడ్డ రెండు జిల్లాల ప్రజల వెతలు తీరాయి. స్వరాష్ట్రంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చొరవతో ఖమ్మంపల్లి వంతెన కల నెరవేరింది. భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాలను అనుసంధానం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. పనులు త్వరగా పూర్తికాగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతులమీదుగా ప్రారంభమైంది. దీంతో దూరభారంతోపాటు రెండు జిల్లాల ప్రజల వెతలు తీరాయి.
భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాల మధ్య సరిహద్దుగా ప్రవహిస్తున్న మానేరు నదిపై వంతెన నిర్మాణం కోసం నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సార్లు ప్రయత్నాలు జరిగినా సఫలీకృతం కాలేదు. దాంతో ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లేందుకు ప్రధానంగా వానకాలంలో అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీ(టీ)ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ విజయం సాధించిన తర్వాత మారుమూల మంథని నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రోడ్లు, చెక్ డ్యామ్లు, కల్వర్టులు, గోదావరి, మానేరు నదులతో పాటు ఇతర వాగులు, వంకలపై వంతెనల నిర్మాణం కోసం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఈ క్రమంలో ముత్తారం మండలం ఖమ్మంపల్లి వద్ద మానేరు నదిపై వంతెన నిర్మాణం కోసం పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవ తీసుకొని రెండు జిల్లాల ప్రజలకు రవాణా ఇబ్బందులను తొలగించేందుకు వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం రూ. 50 కోట్లను ప్లాన్ వర్క్స్ కింద మంజూరు చేసింది. దీంతో ఖమ్మంపల్లి వద్ద మానేరు నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రకృతి పరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నా నిర్మాణాన్ని పూర్తి చేసి జూన్ 17వ తేదీన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేతతో కలిసి ప్రారంభించారు.
రెండు జిల్లాల ప్రజలకు తప్పిన రవాణా తిప్పలు
ఖమ్మంపల్లి వద్ద నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం రెండు జిల్లాల ప్రజలకు దూరాన్ని తగ్గించేందుకు కీలకంగా మారింది. మంథని డివిజన్లోని మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాలతో పాటు జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన ప్రజలు భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు వెళ్లేందుకు సులువుగా మారింది. భూపాలపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు పెద్దపల్లి జిల్లాకు రావడానికి కూడా సౌకర్యవంతంగా ఉంది. వంతెన నిర్మాణం లేనప్పుడు వీరంతా మంథని, కాటారం, భూపాలపల్లి మీదుగా వరంగల్ జిల్లాలకు వెళ్లాల్సి వచ్చేది. వంతెన నిర్మాణంతో దాదాపు మంథని నుంచి భూపాలపల్లి దాదాపు 25 కిలోమీటర్ల వరకు దూరం తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. దీంతో భూపాలపల్లి, తాడిచర్ల బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులు సైతం సకాలంలో విధులకు హాజరయ్యేందుకు వంతెన నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుంది.
బ్రిడ్జి నిధుల మంజూరు.. ఇతర పనులకు మళ్లింపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1995లో మంథని నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చంద్రుపట్ల రాంరెడ్డి వినతి మేరకు అప్పటి ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులను మంజూరు చేసింది. గతంలో ఈ ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండడంతో బ్రిడ్జి నిర్మాణ టెండర్ ప్రక్రియలో హెచ్చరికల కారణంగా కాంట్రాక్టర్లు ఎవరూ పాల్గొనలేదు. దీంతో మూడు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నిధులు పెండింగ్లో ఉండిపోయాయి. 1999 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంథని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ నిధులను వివిధ గ్రామాల్లో మట్టి రోడ్ల నిర్మాణం కోసం మళ్లించారు. దీంతో ఖమ్మంపల్లి వంతెన నిర్మాణం కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీ(టీ)ఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన పుట్ట మధూకర్ ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు ఖమ్మంపల్లి వంతెన నిర్మాణం కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలు మార్లు సీఎం కేసీఆర్తో సహా, సంబంధిత శాఖల మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడంతో వారు స్పందించి ఖమ్మంపల్లి వంతెన నిర్మాణానికి రూ. 50 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో ఖమ్మంపల్లి వంతెన నిర్మాణం పూర్తి కాగా రెండు జిల్లాల ప్రజలు, సింగరేణి కార్మికుల రవాణా కష్టాలు తొలగిపోయాయి.
బ్రిడ్జి నిర్మాణంతో దూరం తగ్గింది
ఖమ్మంపల్లి మానేరుపై వంతెన నిర్మాణంతో తాడిచర్ల వెళ్లేందుకు దూరం తగ్గింది. నేను తాడిచర్లలోని కేడీసీసీ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్న. ప్రతి రోజు విధుల కోసం మంథని నుంచి తాడిచర్లకు వెళ్తాను. గతంలో తాడిచర్లకు వెళ్లాలంటే మంథని వయా కొయ్యూర్ నాగులమ్మ మీదుగా తాడిచర్ల వెళ్లాల్సి ఉండేది. ఇలా వెళ్తే దాదాపు 30 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉండేది. ఖమ్మంపల్లి వంతెనతో కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణిస్తే తాడిచర్ల చేరుకుంటున్నాం. దాదాపు సగం దూరం తగ్గింది.
– చింతపట్ల సంతోష్, తాడిచర్ల కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగి, మంథని
మా గ్రామం మరింత అభివృద్ధి
ఖమ్మంపల్లి మానేరుపై నిర్మించిన వంతెనతో మా ఖమ్మంపల్లి గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. ఖమ్మంపల్లి వంతెన నిర్మాణంతో భూపాలపల్లి నుంచి పెద్దపల్లి, పెద్దపల్లి నుంచి భూపాలపల్లి జిల్లాలకు దూరం చాలా తగ్గుతుంది. దీన్ని ఇతర జిల్లాల ప్రజలు కూడా ఖమ్మంపల్లి మీదుగా ప్రయాణిస్తారు. ఖమ్మంపల్లి గ్రామంలో వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు మా గ్రామం సైతం మరిత అభివృద్ధి చెందుతుంది.
– వినయ్, ఖమ్మంపల్లి వాసి. (మంథని)