Koppula Eshwar | గోదావరిఖని : సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రామగుండం RG-1, OCP 5 లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన రామగుండం బొగ్గు నిల్వలను పరిశీలించి ప్రభుత్వం చూపిస్తున్న బొగ్గు నిల్వలు లెక్కల వాస్తవాలు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో వరుస కుంభకోణాలతో సంస్థనే ప్రశ్నార్థకం చేసేలా దోపిడీ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలకు తెరలేపుతోందన్నారు. ఒకప్పుడు సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ అని, లక్షల కుటుంబాలు బతుకుదెరువు చూపించిన సంస్థ అని ఆయన గుర్తు చేశారు. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీ కాంట్రాక్టర్లు, సోలార్ పవర్ ప్లాంట్, డెటోనేటర్ కాంట్రాక్ట్, పవర్ ప్రాజెక్టుల విషయంలో కుంభకోణాల పరంపర కొనసాగిస్తుందని ఆరోపించారు.
అధికారిక లెక్కలు సింగరేణి వెబ్సైట్ ఉన్న లెక్కల ప్రకారం సింగరేణి వ్యాప్తంగా ఆయా గనులపై 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని ప్రభుత్వం లెక్కలు చూపిస్తున్నదని పేర్కొన్నారు. RG -1, OCP- 5 లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ చేసి ఉందని, ప్రస్తుతం 3 లక్షల 60 వేల టన్నులు అని చెప్తున్నారని, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం మట్టి బెడ్డలు బండలు పనికి రాని వాటిని కుప్పలు చేసి బొగ్గు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని, కేవలం ఇక్కడ 50 వేల మెట్రిక్ టన్నులు కూడా ఉన్నట్లు కన్పించడం లేదని ఆయన అన్నారు.
సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడంతో పాటు కార్మికుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నేతృత్వంలోనే అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నిల్వలు ఎక్కడెక్కడ చూపిస్తున్నరో అక్కడ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంపై సీబీఐ ఎంక్వైరీ జరుపాలని, లేని బొగ్గును ఎలా సృష్టిస్తరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని వృథా చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థం అవుతుందన్నారు. సింగరేణి ప్రజల ఆస్తి అని ఆ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభత్వంపై ఉందన్నారు.
ఇటీవల గోదావరిఖనికి వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పలు విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారని, అందులో ముఖ్యంగా డిపెండెట్ ఉద్యోగాల విషయాన్ని ప్రస్థావించారని, 400 మంది కార్మికులను అన్పిట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని వెల్లడించారని, ఈ క్రమంలో అధికారులు ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని జాగ్రత్త పడి, రెండు రోజుల్లో కార్మికులకు ఉద్యో గనియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. వరుస కుంభకోణాలపై సమగ్రి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.