“నాటి బాధలన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే సంతోషంగ ఎవుసం చేసుకుంటున్నం. 24 గంటల ఉచిత కరెంట్, పుష్కలమైన నీళ్లతో మంచిగ రెండు పసళ్లు పండించుకుంటుంటే కన్నుగొట్టిన కాంగ్రెస్ మళ్లీ కొత్త కథ షురూ చేస్తంది. మీ పాలన వద్దని బండకేసి కొట్టినంక కూడా బుద్దిరాలె. ఇప్పుడు ఎన్నికలు వచ్చినయో లేదో.. కరెంట్పై పూటకోమాట మాట్లాడుతంది. ఆ పార్టీని నమ్మితే మా బతుకులు ఆగమైతయి. ఆ పార్టీ నాయకులు రోజుకో మాట మాట్లాడుతున్నరు. మొన్ననేమో.. సాగుకు మూడు గంటల కరెంటిస్తే సరిపోతదని రేవంత్రెడ్డి అన్నడు. మూడు గంటల్లోనే మూడెకరాలు పారించవచ్చని మాట్లాడుతున్నడు. ఎట్లా పారుతదో చెప్పాలి.
ఎన్నడన్నా ఎవుసం చేసిన మొఖమేనా..? మేం గట్టిగ మాట్లాడితే.. మళ్లీ 10హెచ్పీ మోటర్ పెట్టాలంటుండు. మా రైతులు ఎవరైనా అంత పెద్ద మోటర్లు వాడుతరా..? వాడితే ఇప్పుడు పెట్టిన ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా..? అయినా ఆ మోటర్ పెట్టుకోవాలంటే రూ.లక్షకు మీదనే ఖర్చయితది. రూపాయి పాయిదా ఉండదు. ఇదేందని లొల్లి చేస్తే ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తమంటున్నరు.. నెల రోజుల్లోనే మూడు మాటలు మాట్లాడిన్రు. నిజానికి ఇప్పుడు మాకు కావాల్సినంత కరెంటు ఉంది.
కేసీఆర్ వచ్చినంక ఢోకాలేకుండా పోయింది. కంటినిండా నిద్రపోతున్నం. మాకు అవసరమైనప్పుడు వెళ్లి మోటర్ పెట్టుకుంటున్నం. ఇన్ని సౌలతులుండంగా ఆ పూటకో మాట మాట్లాడే పార్టీ మాకు అవసరం లేదు. మా బతుకులు మేం ఆగం జేసుకోం.” అంటూ జిల్లా రైతులు మండిపడుతున్నారు. ఎవుసానికి ఇచ్చే ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలపై కన్నెర్రజేస్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్కు ఓటేస్తే మా బతుకులు ఆగమైతయనే విషయం మాకు అర్థమవుతుంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు రోజుకో మాట మాట్లాడుతున్నరు. మొదట్లనేమో మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నడు. మూడు గంటల్లో మూడెకరాలు పారుతుందన్నడు. ఎన్నడైనా ఎవుసం జేసినోడైతే ఇట్లా మాట్లాడడు.. అందుకే మాకు కోపమొచ్చింది. అందరం కలసి లొల్లిలొల్లిజేసినం. ఇగ ఇప్పుడు ఎన్నికలొచ్చినయి గదా..? మళ్లీ కొత్తపాట పాడుతుండ్రు. మూడు గంటల్లో మూడు ఎకరాల పొలం ఎట్లా పారుతుందంటే.. 10 హెచ్పీల మోటార్లు పెట్టాలంటుండ్రు. రైతు ఎవరైనా 10 హెచ్పీల మోటార్లు వాడుతడా? ఒకవేళ వాడితే ఇప్పుడు పెట్టిన ట్రాన్స్ఫార్మర్లు ఆగుతాయా? పోనీ పెట్టాల్సి వస్తే ఒక మోటారు, వాటికి కావాల్సిన పైపులు, అందుకు సరిపోయే విధంగా స్టాటర్ ఇలా అన్ని కలిపి ఒక్కో దానికి రూ.లక్ష మీదే అయితది. ఈ పైసలు ఎవరిస్తారు?.
దీని మీద లొల్లి లొల్లి అయితనే ఉంది. దీన్ని జూసిన కాంగ్రెస్వోళ్లు ఇప్పుడు మరో మాట మాట్లాడుతుండ్రు. అట్లగాదు గానీ మేం కూడా 24 గంటల కరెంటు ఇస్తమంటుండ్రు. నెల రోజుల్లో మూడు మాటలు మాట్లాడింది జూసినం. అందుకే మేం ఆలోచన జేస్తున్నం. నిజానికి ఇప్పుడు మాకు కావాల్సినంత కరెంటు ఉంది. కేసీఆర్ వచ్చినంక ఢోకాలేకుండా పోయింది. కంటినిండా నిద్రపోతున్నం. మాకు అవసరమైనప్పుడు వెళ్లి మోటర్ పెట్టుకుంటున్నం. ఇన్ని సౌలతులుండంగా కాంగ్రెస్ ఓటు వేసి మా బతుకులు మేం ఆగం జేసుకోం.
మునపటి లెక్క ఎడ్డి రైతులం కాదు. మాదాంటో చైతన్యం వచ్చింది. ఎవరేమిజేస్తుండ్రో చూస్తున్నం. ఎవరికి ఓటు ఏయాలో..? ఎవరిని దూరంగా పెట్టాలో..? మాకు తెలుసు. ఒక్క మాట జెప్పాలంటే మా బతుకుల్లో మేం మట్టయితే పోసుకోం అంటున్నారు జిల్లా రైతులు. వ్యవసాయరంగానికి ఇచ్చే ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలు, పూటకో మాట తీరుపై జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు. వారిమాట్లనే చూద్దాం.
నాకు కొడిమ్యాల మండలం అప్పారావుపేటలో 10 ఎకరాల భూమి ఉంది. గత ప్రభుత్వాల కాలంలో నీళ్లు లేక. కరెంట్ లేక భూమి బీడుగా మారింది. బతకడమే చానా కష్టమైంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వ్యవసాయ భూమి పక్కన కాలువ పైన చెక్ డ్యాం నిర్మించారు. భూ గర్భజలాలు మస్తు పెరిగినయి. బావి తవ్వుకున్న. మోటర్ పెట్టుకొని పొలంతో పాటు కూరగాయలు పండిస్తున్న. మంచిగ బతుకుతున్న. అంత మంచిగ ఉన్నదనుకుంటే ఈ కాంగ్రెస్ మళ్లీ మూడు గంటల కరెంట్ ఇస్తామంటంది. ఆ కరెంట్తో నా మొదటి మడి కూడా పారదు. ఇంకా 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలంటంది. ఎట్ల పెట్టుకుంటరు.. ఎవరు కొనిస్తడు.. వాళ్లు కొనిస్తరా.. చెప్పాలి. కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ పాత కథే అయితది. మాకు మూడు గంటల కరెంట్ వద్దు.. 24 గంటలే కావాలి.
– గుడిపెల్లి రాజిరెడ్డి, రైతు, అప్పారావుపేట, కొడిమ్యాల మండలం
కాంగ్రెస్ పాలనలో కరంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏనాడూ కంటి నిండా నిద్ర కూడా పోలేదు. కరంట్ కోసం రాత్రంతా జాగారం చేసేటోళ్లం. రాత్రిళ్లు పొలాల దగ్గరకు పోతే పురుగు, పాములు, తేళ్లు కరిచేవి, కరెంట్ షాకులతో ఎందరో రైతులు చనిపోయారు. ఆ బాధలు మళ్లీ రావద్దు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ బాధలు తీరినయి. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నరు. ఎప్పుడంటే అప్పుడు పోయి పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నం. రాత్రిపూట బాయిల కాడ పండే బాధలు పోయినయి. ఇప్పుడు కాంగ్రెస్ సాగుకు 24 గంటలు ఎందుకు.. మూడు గంటలు చాలు అంటన్నదట. ఎట్ల సరిపోతది. వాళ్లు ఎన్నడన్నా ఎవుసం చేసిన్రా..? మా రైతులను మళ్లీ నరకంల పడేస్తరా..? మేం మోసపోం. 24 గంటల కరెంటిచ్చే బీఆర్ఎస్సే మాకు కావాలి.
– ఈర్ల రాము, రైతు, లక్ష్మీదేవిపల్లి, సారంగాపూర్
తెలంగాణ ప్రభుత్వంలోనే మేం సంతోషంగ ఉన్నం. రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, చాలినన్ని సాగు నీళ్లు ఇస్తుండడంతో కేసీఆర్పై నమ్మకం పెట్టుకున్నం. సార్ వచ్చిన తర్వాతనే కదా..? మా రైతుల బతుకులు బాగుపడ్డయి. 24 గంటల విద్యుత్ వస్తంది. రాత్రిళ్లు కంటి నిండా నిద్రపోతున్నం. నాడు రైతులను పట్టించుకున్నోళ్లు ఉన్నరా..? కరెంట్ కోసం ఎన్ని బాధలు.. ఎరువుల కోసం ఎన్ని కష్టాలు పడ్డమో మాకు తెలుసు. అ బాధలు ఇప్పుడు లేవు. పంటను కూడా గిట్టుబాటు ధరకు కొంటున్నరు. కాంగ్రెస్ ఏండ్ల కొద్ది పాలించి ఏం చేయలే. వాళ్ల పాలనలో కరెంట్ ఎప్పుడత్తదో.. ఎప్పడు పోతదో తెలియని పరిస్థితి ఉండె. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అది చేస్తాం.. ఇది చేస్త్తామంటే నమ్మేస్థితిలో లేం. అప్పుడు చేయనోళ్లు.. ఇప్పుడు చేస్తరా..? వాళ్లతో ఏం కాదు.
– ఎలేటి లక్ష్మారెడ్డి, రైతు, సారంగాపూర్
కాంగ్రెస్ విధానం ద్వారా రైతులకు ఇబ్బందులు తప్పెటట్లు లేవు. మూడు గంటల కరెంట్ ఇచ్చి 10 హెచ్పీ మోటర్ ద్వారా పొలం పారియాలే అంటున్నరు. 10 హెచ్పీ మోటర్ కొనే స్థోమత నా దగ్గర లేదు. కాంగ్రెసోళ్లు కొనిస్తారా మరి. అయినా అంత పెద్ద మోటర్లు అందరూ పెట్టుకొని ఒక్కసారి కరెంట్ ఒత్తుతే ట్రాన్స్ఫార్మర్ ఉంటదా..? కాలి బూడిద కాదా..? ఇంకా ఆ ప్రెషర్కు నీళ్లు ఫోర్స్గా వచ్చి మడి తడువది. నీళ్లు మెల్లగా వెళితేనే మొత్తం తడుస్తుంది. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ నాయకులకు ఏం తెలువదని అర్థమైతంది. వాళ్ల విధానం గాలిలో అద్దాల మేడ కట్టినట్లు ఉంది. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నరు.
-రేకులపల్లి తిరుపతిరెడ్డి, రైతు, అప్పారావుపేట, కొడిమ్యాల మండలం
పొరపాటున కాంగ్రెస్ను నమ్మితే ఎవుసం ఆగమైతది. మూడు గంటల కరెంటు సరఫరా వల్ల పంటలకు సకాలంలో నీరందక ఎండిపోయి నష్టం జరిగే ప్రమాదం ఉంటది. సాగుకు 24 గంటల కరెంట్ అవసరం లేదని మూడు గంటలు సరిపోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల మాట్లాడిండు. మూడు గంటలు కూడా కరెంటు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉండదు. పదేళ్ల కిందట కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉండేదో అప్పుడు కండ్లారా చూసినం. సక్కగ కరెంటు లేక, పంటకు నీటి తడి పెట్టలేక ఇబ్బందులు పడ్డం. తొమ్మిదేండ్లుగా ఆ బాధలు, రందీ లేవు. లో ఓల్టేజీ లేదు, కోతలు లేవు. 24 గంటలు కరెంటు వస్తుంది. రైతుల మేలుకోరే కేసీఆర్ పాలన ఉంటేనే రైతాంగం బాగుంటది.
– సింగిరెడ్డి రవికాంత్రెడ్డి, రైతు, అమ్మక్కపేట
కాంగ్రెస్ నాయకులు ఎవుసానికి మూడు గంటల కరెంటే ఇస్తమంటున్నరు. ఇదేందని అడిగితే.. మళ్లీ 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నరు. మరీ అంతపెద్ద హెచ్పీ మోటర్ను కొనుకోనే శక్తి మాకు లేదు. అన్ని డబ్బులు పెట్టుకునే స్థోమత లేదు. గతంలో అసొంటి మోటర్ను మేం చూడలే. వ్యవసాయానికి కరెంటు సరఫరా చేయడంలో కాంగ్రెసోళ్లకు చిత్తశుద్ధి ఉండదు. గత కాంగ్రెస్ పాలనలో కరెంటు బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడు కరెంటు వస్తదో, మరెప్పుడు పోతదో తెలిసేది కాదు. ఇంటికి, పంపు సెట్టు కాడికి తిరుగుడికే సరిపోయేది మా టైం అంతా. తొమ్మిదేండ్ల నుంచి కరెంటు మంచిగుంటున్నది. పగటి పూటనే పంటలకు నీటి తడి పట్టిస్తున్నం. కరెంటు సమస్యలు ఏ మాత్రం లేదు. 10 హెచ్పీ మోటర్ను పెట్టుకునేంత శక్తి మా రైతులకు ఉండదు. వీటి వల్ల కరెంటుపై తీవ్ర భారం పడుతుంది.
– బాడాల తిరుపతిరెడ్డి, రైతు, అమ్మక్కపేట
నాడు ఎప్పుడూ కరెంట్ మోటర్లు కాలుతుండె. కరెంట్ సరిగ్గా ఇవ్వక ఎవుసం ఆగమైతుండె. రాత్రి పూట ఇచ్చే రెండు మూడు గంటల కరెంట్కు పొలాల కాడ జాగారం చేసేటోళ్లం. రాత్రిళ్లు పురుగు, పాములు, తేళ్లు కుట్టేవి. కరెంట్ షాకులతో మా ఊళ్లో చాలా మంది రైతులు చనిపోయారు. కానీ సీఎం కేసీఆర్ అచ్చినంక కరెంట్ కష్టాలు తప్పినయి. నాట లెక్క మోటర్లు కాలుతలేవు. ట్రాన్స్ఫార్మర్లు మాడుతలేవు. 24 గంటల కరెంట్తో ఎప్పుడంటే అప్పుడే కరెంట్ వాడుకుంటున్న. మంచిగ ఎవుసం చేసుకుంటున్న. అయితే కాంగ్రెసోళ్లు ఎవుసానికి మూడు గంటల కరెంట్ ఇస్తమని, 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నరు. ఆ మోటర్ వాళ్లు కొనిస్తరా..? ఇవన్నీ పనికిరాని మాటలు. ఇది రైతును ఆగం చేసే కుట్ర. ఇప్పుడే మంచిగుంది. కేసీఆర్ సార్ మంచిగా పని చేస్తున్నరు. మేమంతా అండగా ఉంటాం.
– చాతరాసి ధర్మయ్య, రైతు, సారంగాపూర్