ధర్మపురి, ఫిబ్రవరి 7 : ‘కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోయి గోసపడుతున్నరు.. ఆరు గ్యారెంటీలపై ఆ పార్టీ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద్దు. ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయం. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిచేసుకొని నిబద్దతతో పనిచేయాలి’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
బుధవారం ధర్మపురిలోని నృసింహ గార్డెన్స్లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పార్టీ రాష్ట్ర పరిశీలకుడు, మాజీ స్పీకర్ మధుసూదనాచారితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రస్తుత పాలనలో దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ నెట్టుకువస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికి వదిలి టీఎస్ను టీజీగా, తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేయడానికి ప్రాధాన్యతనివ్వడం విడ్డూరమన్నారు. రూ.6 లక్షల కోట్ల అప్పులు చూపి అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారే కానీ, రూ.50 లక్షల కోట్ల ఆస్తులు ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు. ఈ పదేళ్లలో రాష్ట్రంలో 23 ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని, వీటి ఆధారంగా కోటి 20 లక్షల హెక్టార్లకు సాగునీరందిందని, ఇవ్వన్నీ ప్రజలు గమనించాలని కోరారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కాగా, ఈ సందర్భంగా పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కే ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. సమావేశంలో కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, ఎంపీపీలు చిట్టిబాబు, లక్ష్మి, జడ్పీటీసీలు అరుణ, కరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సౌళ్ల భీమయ్య, ఏఎంసీ చైర్మన్ రాజేశ్కుమార్ తదితరులున్నారు.
అప్పులు చేయడం.. సంపద సృష్టించడం.. పేదల కు పంచడం అనేది కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. పైసా అప్పు తేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమో దమ్ముంటే నిరూపించాలి. ప్రభు త్వ ఫలాలు ప్రజలకు అందించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అంతులేని, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను నమ్మించేందుకు పచ్చి అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నది. రానున్న పార్టమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.
-మధుసూదనాచారి, రాష్ట్ర పరిశీలకుడు, మాజీ స్పీకర్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. పార్టీ అధినేత కేసీఆర్ సూచించిన అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి ఏడుస్తున్నడని ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కానీ, ఇప్పుడు ప్రజలు ఏడ్చే పరిస్థితులు వచ్చాయి. ప్రజల కష్టాలు పోవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్