కరీంనగర్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; ‘కాంగ్రెసోళ్లకు ఎద్దెర్కనా.. ఎవుసమెర్కనా..?ఎవుసం చేసెటోళ్లకైతే రైతుల బాధలు తెలుస్తయి. వీళ్లకేం తెలుస్తయి? అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్రు. మూడు గంటల కరెంట్ చాలంటున్రు. ఎట్ల సాధ్యమంటే మళ్లీ 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటున్రు? ఒక్కో రైతు రూ.లక్ష ఖర్చు వెట్టి పెద్ద మోటర్ కొనాలా..? వాటితో మాకు ఏం ఫాయిదా..? మాపై భారం వేసి అప్పుల పాల్జేసేందుకేనా..? యాభై ఏండ్లు అధికారంల ఉండి ఏం చేయలె. ఓ కరెంట్ సక్కగియ్యిలె. నీళ్ల్లియ్యలె. పంటలు ఎండుతున్నా పట్టించుకోలె. ఆఖరుకు రైతు సచ్చిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకోలె. ఇప్పుడేమో పూటకోమాట చెప్పి పరేషాన్ చేస్తున్రు. వాళ్లను నమ్మద్దు.. వాళ్ల కరెంట్ అసలే వద్దు’ అని జిల్లా రైతులు కుండబద్ధలు కొడుతున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాయమాటలపై మండిపడుతున్నారు. ఏ పార్టీ అయినా ప్రజలకు మేలు చేసేలా మాట్లాడాలే గానీ, ఇలా ఆగం చేయద్దని సూచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
‘కాంగ్రెస్ మొదటి నుంచి రైతు వ్యతిరేకిగా ఉన్నది. యాభై ఏండ్లకుపైగా పాలించినా రైతులకు చేసిందేమీలేదు. కరెంట్ సక్కగా ఇయ్యలె. నీళ్లు సక్కగా ఇయ్యలె. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలె. ఆఖరుకు అప్పుల బాధతో సచ్చిపోయినా ఆదుకోలె. మళ్లీ ఆ పార్టీ నాయకులు ఇప్పుడొచ్చి మాయమాటలు చెబుతున్రు. బీఆర్ఎస్ సర్కారు 24గంటల కరెంట్ ఇస్తాంటే.. మేమేదో చేస్తామంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్రు. మమ్మల్ని ఆగం చేయాలని చూస్తున్రు. మళ్లీ మేం మోసపోం. మా బతుకుల్లో మట్టి పోసుకోం’ అని జిల్లా రైతులు స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం 24 గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నదని, అన్నదాతలు ఇప్పడిప్పుడే సంతోషంగా బతుకున్నారని చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నదని, అందుకే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, మంచి పథకాలను రద్దు చేస్తామంటున్నదని మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధిపొందాలన్న ఉద్దేశ్యంతో అబద్ధపు హామీలు, ఝూటా మాటలు చెబుతున్నదని విమర్శించారు. కర్ణాటకలో అలాగే చెప్పి నిండా మోసం చేసిందని, ఇప్పుడు ఇక్కడ ఇలాగే చేయాలని చూస్తున్నదన్నారు.
కరెంట్పై పూటకోమాటతో పరేషాన్ చేస్తున్నదని, ఓసారి 3గంటల కరెంట్ సరిపోతుందని, అదెలా సాధ్యమంటే 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నారని మండిపడుతున్నారు. అసలు వ్యవసాయ బోర్లకు ఆ మోటర్లు పెట్టుకుంటారా..? ప్రశ్నించారు. అవి పెట్టాలంటే ఒక్కో రైతుపై లక్షకుపైగా ఖర్చవుతుందని, ఆ పైసలు వాళ్ల ఇంట్ల నుంచి ఇస్తారా..? అని ధ్వజమెత్తారు. పెద్ద మోటర్లు పెట్టుకుంటే కరెంటు సరిపోతదా..? బావుల్లో, బోర్లలో నీళ్లు ఊర్తయా..? నీటి ప్రెషర్ను పైపులు తట్టుకుంటయా..? లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా..? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎద్దెర్కనా..? ఎవుసమెర్కనా..? నిలదీస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న చీకటి కష్టాలు మళ్లీ వద్దని రైతన్నలు ముక్తకంఠంతో స్పష్టం చేస్తారు. ఈ కాంగ్రెసోళ్లు మా బతుకులు ఆగం చేయాలని చూస్తున్నారని, వాళ్ల మాటలతో మోసపోమని స్పష్టం చేస్తున్నారు. రైతుకు అన్ని విధాలా అండగా నిలిచిన బీఆర్ఎస్ సర్కారునే మళ్లీ గెలిపించుకుంటామని చెబుతున్నారు.
చాలా ఖర్చు పెట్టాలే
నాడు సమైక్య రాష్ట్రంలో రాత్రి పూట కరెంటు ఇచ్చేటోళ్లు. ఆ ఇచ్చిన కరెంటుతో పొలమంతా సరిగా పారేది కాదు. ఇప్పుడు తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తుండు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎవుసానికి 3 గంటల కరెంటు సాలు.. 3 గంటల్లో పొలం అంతా పారుతదన్నడు. ఇందుకు 10 హెచ్పీ మోటర్లను పెట్టుకోవాలని చెబుతుండు. పొలాలకు 10 హెచ్పీ మోటర్లు ఉన్నాయా, తేవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి. ఎవ్వరు ఇయ్యాలే. గిట్లాంటి 10 హెచ్పీ మోటర్లు వాడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవా..? గీ మాత్రం వీళ్లకు తెలియదా..? ఎవుసం మీద సోయి ఉండే మాట్లాడుతుండా..? సామాజిక పరిస్థితులు తెలియని వ్యక్తికి పరిపాలన ఇస్తే ఇగ ఆగమవుడే. గిట్లాంటోళ్లకు ఓట్లు వేస్తే మళ్లీ మన బతుకులు మొదటికే వస్తయి.
-నామాల శ్రీనివాస్, రైతు, సదాశివపల్లి (మానకొండూర్ రూరల్)
రైతుకు మూడు గంటల కరెంట్ సరిపోదు
వ్యవసాయం చేసే రైతులకు రోజూ మూడు గంటల కరెంట్ సరఫరా సరిపోదు. తెలంగాణలో రైతులు 10హెచ్పీ మోటర్లు వాడుతలేరు. రైతులు వాడేది 3 హెచ్పీ మోటర్లే. 10 హెచ్పీ మోటర్లు వాడితే లోవోల్టేజీ సమస్యలు అధికమవుతాయి. అందరూ రైతులు ఒకేసారి 10 హెచ్పీ మోటర్లు వాడితే ఇప్పుడున్న ట్రాన్స్ఫార్మర్లు పని చేయవు. నిత్యం కరెంట్ సమస్యతోపాటు రైతులకు మోటర్ల రిపేర్ చార్జిలు కూడా భారమవుతాయి. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తేనే రైతులకు సరిపొతుంది. 10 హెచ్పీ మోటర్లు పెట్టి మూడు గంటల కరెంట్ ఇస్తే, వ్యవసాయం చేయడం చాల కష్టమౌతుంది. మూడు గంటల కరెంట్తో కనీసం రెండు ఎకరాలు కూడా పారదు. మూడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతున్న రేవంత్రెడ్డికి సాగు గురించి ఏం తెలుసు. వ్యవసాయం గురించి తెలవనోళ్లు గిట్లనే అడ్డందొడ్డం మాట్లాడతరు.
-పబ్బతి రంగారెడ్డి, రైతు, దుబ్బపల్లి(కరీంనగర్ రూరల్)
10 హెచ్పీ మోటర్ నేనెప్పుడూ సూడలే..
నేను 40 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న. నేనైతే ఎప్పుడూ 10 హెచ్పీ మోటర్ సూడలేదు. మా ఊళ్లో కూడా వాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలంటున్నరు. రైతుల్లో ఎక్కువ మంది నిరుపేదలే ఉన్నరు కాబట్టి 10 హెచ్పీ మోటర్లు కొనే సామర్థ్యం లేదు. ఇలాగైతే వ్యవసాయం మళ్లీ కష్టంగా మారే పరిస్థితి ఉంటది. సీఎం కేసీఆర్ లాగా వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిన నాయకుడిని నేను ఇది వరకు సూడలేదు. కాంగ్రెసోళ్లను నమ్ముకుంటే నట్టేట ముంచేటట్టున్నరు. ఇప్పుడిప్పుడే పంటలు మంచిగ పండి రైతులు ఆనందంగా ఉన్నరు. కాంగ్రెసోళ్లు కరెంట్ మూడు గంటలు చాలని పిడుగుల్లాంటి మాటలంటున్నరు. వీళ్లను చూస్తే మంచిగనిపిస్తలేదు. పైసా లేకుండా కరెంట్ ఇచ్చే సీఎం కేసీఆరే ఉండాలి.
– ఎన్ లక్ష్మయ్య, బద్దిపల్లి, (కొత్తపల్లి)
మళ్లీ బాయిల కాడ ఉండాల్సిందే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలకు వచ్చి మూడు గంటల కరెంటు గనుక ఇస్తె మళ్లీ మునుపటి రోజులత్తయ్.. కరెంటు కోతలు మొదలైతయ్.. రాత్రింబవళ్లు రైతులు బాయిల కాడనే ఉండాల్సి వస్త్తది.. రైతులకు మళ్లీ కష్టాలు మోపైతయ్.. మోటర్లపై భారం పడి కాలిపోతయ్.. రైతులపై భారం ఎక్కువైతది.. పంటల దిగుబడి తగ్గి దివాళా తీస్తరు.. భూముల ధరలు కూడా తగ్గుతయ్.. ఇప్పుడు ఇస్తన్న దినాం కరెంటుతో రైతులు సల్లంగ ఉన్నరు.. ఓట్లేసెటప్పుడు రైతులు తమ మంచి చెడ్డలను ఆలోచించి ఓటెయ్యాలె.
– గాలి ఘట్టయ్య, రైతు, తాడికల్ (శంకరపట్నం)
వాళ్లకు ఎవుసం తెలుసా?
కాంగ్రెస్ నాయకులు రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతదని మాట్లాడుతున్నరు. వాళ్లకు అసలు వ్యవసాయం గురించి తెలువదు. మూడు గంటల కరెంటు ఇస్తే రోజుకొక్క మడి కూడా తడవదు. రేవంత్రెడ్డి 10 హెచ్పీ మోటర్ అంటున్నడు. నాకు తెలిసిన వరకు బావుల వద్ద 10హెచ్పీ మోటర్లను సూడలే. నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. ఇందులో వ్యవసాయ బావి ఉంది. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వబట్టి ఒక్క బావితో 3 ఎకరాలకు నీళ్లు పెట్టుకుంటున్న. 10 హెచ్పీ మోటర్ పెడితే బావిలో నీళ్లు లేకుండా పోతయ్. రైతులకు కేసీఆర్ సారు మంచిగా చేస్తుంటే వాళ్ల కండ్లు మండుతున్నయ్.
-కందాల కొమురెల్లి, రైతు (ఇల్లందకుంట)
కాంగ్రెస్కు ఓటేస్తే రైతు బతుకు ఆగమే..
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇయ్యలేని హామీలు ఇప్పుడు ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నది. అవి నమ్మితే తెలంగాణ రైతుల బతుకు ఆగమైతది. మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుందని, 10 హెచ్పీ మోటర్తో గంటల ఎకరం పారించవచ్చు అని అంటున్న ఆ పార్టీ నాయకుడు రేవంత్రెడ్డి మాటలు వినీ కూడా వారికి ఓటేస్తే వ్యవసాయం పూర్తిగా అధోగతిపాలవుతుంది. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా రోడ్లపై తిరిగే యువకుల మాటలు విని కాంగ్రెస్, బీజేపీకి రైతులు ఓట్లేస్తే వాళ్ళ బతుకులు బస్టాండయితయి. ఎవుసం పూనాస పడుతుంది. కరెంటు, నీళ్లు ఉంటేనే అందరికీ పని దొరుకుతుంది. కనుక ఇప్పటికైనా రైతులను అన్ని విధాలుగా ఆదుకునే సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి. అది మన రైతుల చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్ నేతల మాటలు విని రాష్ర్టాన్ని వారి చేతుల్లో పెడితే మళ్లీ 20 ఏండ్లు వెనుకకు పోతాం.
– పోరెడ్డి తిరుపతిరెడ్డి, రైతు, పెద్దపాపయ్యపల్లి (హుజురాబాద్టౌన్)
10 హెచ్పీ మోటర్లు ఎవరూ వాడరు
వ్యవసాయానికి ఇప్పుడున్న కరెంట్ సరఫరాతో ఎలాంటి ఇబ్బంది లేదు. 24 గంటల నాణ్యమైన కరెంటు ఉంటుంది. బోర్లు, బావుల్లో పుషలంగా నీరు ఉంది. ఎప్పుడంటే అప్పుడు మోటర్ ఆన్ చేసుకుని పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్న. కానీ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లు మూడు గంటల కరెంటు అయితే రైతులకు కష్టాలు మొదలైనట్లే. రైతులు భార్యా, పిల్లలను వదిలిపెట్టి రాత్రంతా బావులు, బోర్ల కాడ జాగారం ఉండాలి. రాత్రిపూట పాములు, తేల్ల కాటుకు చనిపోవాల్సిందే. రైతుల ప్రాణం పోతే వాళ్ల కుటుంబాలు ఆగమైపోతాయి. ఆ పాపం అంత కాంగ్రెస్దే. రైతులెవ్వరూ 10హెచ్పీ మోటర్లు వాడరు. ఐదు నుంచి పది ఎకరాల వరకు రైతులు కూడా 3హెచ్పీ, 5హెచ్పీ మోటర్లే వాడతరు. సామాన్య రైతులు 10 హెచ్పీ మోటర్లు ఎందుకు వాడతరు. 10 హెచ్పీ మోటర్లతో బావిలో నీరు త్వరగా ఖాళీ అయిపోయి మోటర్ మీద భారం పడుతుంది. కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డికి వ్యవసాయం మీద కనీస అవగాహన ఉన్న చిన్న, సన్నకారు రైతులు 10హెచ్పీ మోటర్లు వాడరు అనే విషయాన్ని గుర్తించాలే. రేవంత్రెడ్డి అలాంటి పలికి మాలిన మాటలు మాట్లాడడం సరికాదు.
-బోడ నర్సింహారెడ్డి, రైతు, దుబ్బపల్లి (గన్నేరువరం)
రైతులకు మళ్లీ కన్నీళ్లే..
నాకు తొమ్మిదెకరాల భూమి ఉన్నది. 35 ఏండ్ల నుంచి ఎవుసంజేత్తన్న. రెండు బావులున్నయి. ఒకప్పుడు బాయిల నీళ్ళుంటే కరెంట్ ఉండేది గాదు.. కరెంట్ ఉంటే బాయిల నీళ్లు ఉండేటియిగాదు. కరెంట్ ఎప్పుడు అస్తదో తెల్వక రాత్రనక, పగలనక బాయికాడ కావలిగాసుకుంటుండేది. కరెంట్ ఎక్కువ తక్కువ అచ్చి మోటర్లు కాలిపోయేది. ఫీజు వైర్లు పెట్టవోయి షాకులు గొట్టి చాలా మంది చనిపోయేది. ఇచ్చే 6 గంటల కరెంట్ ఏ లైన్కు అస్తదో తెల్వక, తీగలు తగిలిచ్చుకుంటే పాణాల మీదికి అచ్చేది. కరెంట్ సరిపోక ఏసిన పంటలో సగం ఎండిపోయేది. పెట్టువడి గూడా ఎల్లక అప్పులపాలయ్యెటోళ్లం. ఆనాడు రైతులం పడ్డ కష్టాలు ఎప్పటికీ మర్చిపోం. తెలంగాణ అచ్చినంక 24 గంటల కరెంట్, పుష్కలమైన నీళ్ళు ఉంటన్నయి గావట్టి మోటర్లు కాలుడు లేదు. పంటలు ఎండుడు లేదు. మళ్లీ కాంగ్రెస్కు ఓటేస్తే పాత రోజులే అస్తయి. రైతులకు మళ్లీ కన్నీళ్లే.
– మేకల సత్యనారాయణరెడ్డి, రైతు, మామిడాలపల్లి (వీణవంక)