సహజంగానే ఎన్నికల ముందు నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కి అలవాటేనన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ను బద్నాం చేయడంతోపాటు కాంగ్రెస్లో అలజడి రేపే ఉద్దేశంతో ఆయన మూడు రోజుల క్రితం కరీంనగర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నరు. ఆ పార్టీలో ఆయన కోవర్టులున్నరు.
ఎమ్మెల్యేలను కొనేందుకు స్కెచ్ వేస్తున్నరు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్తో టచ్లో ఉన్నరు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఆ బద్నాంను మా పార్టీపైకి నెట్టివేసినా ఆశ్చర్యం లేదు’ అంటూ చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఆయనను ఇరకాటంలో పడేశాయి. ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్గోల్ చేసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతుండగా, దీనిపై కాంగ్రెస్ నేతలు ఏకంగా సీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతున్నది.
కరీంనగర్, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ మళ్లీ పాతబాటే పట్టారు. ఇటు బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్పై విమర్శలకు దిగుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలు జరుగుతున్నాయంటూ ఈ నెల 14న సంజయ్ మాట్లాడిన మాటలు దుమారం రేపగా, ఆయన మాట్లాడిన రోజే రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదంటూ మండిపడ్డారు. అన్ని రంగాల్లో విఫలమైన ఎంపీల్లో సంజయ్ ముందుంటారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాదు, ప్రభుత్వం కూలిపోతుదంటూ జ్యోతిష్యుడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా మరింత సీరియస్గా తీసుకున్నారు. బండి మాటలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, ఏసీపీ నరేందర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయనే విషయం సంజయ్కు ఏవిధంగా తెలిసిందో తెలుసుకోవాలని, అలాగే ఒక వేళ కుట్రలు చేసి ఉంటే ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు తెలుపలేదో చెప్పాలని, ఈ కుట్రల్లో బండి భాగస్వామ్యం ఎంత ఉందన్న అంశాలపై విచారణ జరిపి సంజయ్పై కేసు నమోదు చేయాలని ఆ ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
బండి మాటలకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడం చూ స్తే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేలా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న లక్ష్యంతో ఇటు బీఆర్ఎస్ను బద్నాం చేసి.. అటు కాంగ్రెస్లో అలజడి రేపుదామని చూసిన బండి ప్లాన్ తిరగబడడమే కాదు, సెల్ఫ్గోల్ చేసుకున్నారన్న చర్చ ప్రస్తుతం ఆయన సొంత పార్టీ బీజేపీలోనే నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో చేసిన ఆరోపణలను నిరూపించుకోవాల్సిన అవసరం బండిపై ఉన్నది.
బండి మాటల వ్యవహారంలో ఆరోపణలు, ప్రత్యారోపణల వరకు విషయం ఉంటే అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ, కాంగ్రెస్ ఏకంగా ఏసీపీకి ఫిర్యాదు చేయడంతో ఇది చర్చనీయాంశమవుతున్నది. ఆ ఫిర్యాదు వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం కూడా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బండి తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటారా..? ఫిర్యాదులో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తారా..? ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని చెప్పినట్టుగా సాక్ష్యాలను చూపుతారా..? లేక ఎప్పటి మాదిరిగానే కొట్టి పారేస్తారా..? మాట మారుస్తారా..? అన్నది మున్ముందు తేలనున్నది.
ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం ఈ వ్యవహారంపై ముందుకు వెళ్తుందా లేదా..? అన్నది తేలాల్సి ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున ఫిర్యాదుపై విచారణ జరిపేలా చేస్తారా..? లేక ఫిర్యాదుకే పరిమితమై ఊకుంటారా..? ఈ ఫిర్యాదు ప్రచారం కోసం చేసిన స్టంటా..? లేక నిజంగానే బండిని విచారణ చేసేంత వరకు వెంట పడుతారా..? అన్నది మున్ముందు తేలనున్నది. మొత్తంగా చూస్తే విమర్శలు, ప్రతివిమర్శలు, పోలీసులకు ఫిర్యాదుల నేపథ్యంలో ఎవరు తలొగ్గుతారో వేచి చూడాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆ రెండు పార్టీల్లోనూ దుమారం రేపుతున్నది.