మల్యాల, జూలై 6: ‘ప్రశాంతంగా ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ అలజడి సృష్టిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అభివృద్ధిపై ప్రశ్నించే గొంతులను బెదిరిస్తూ దాడులు చేస్తున్నది. ఇంకెన్నాళ్లీ రౌడీయిజం?’ అంటూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. ఆదివారం మల్యాలలోని 8వ వార్డులో బురదమయంగా మారిన రోడ్డును బాగుచేయాలంటూ బీఆర్ఎస్ నాయకుడు దొంతరవేణి శేఖర్ వరి నాటు వేసి నిరసన తెలిపాడని, రాత్రి అతడి ఇంటికి రాజారాం గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్, నూకపల్లి సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్, పలువురు వ్యక్తులు వెళ్లి దాడికి యత్నించారని, పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది రావడంతో వెళ్లిపోయారని మండిపడ్డారు.
సోమవా రం ఉదయం బాధితుడు శేఖర్, మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి సుంకె మల్యాల ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో మాట్లాడారు. గ్రామాభివృద్ధి విషయంలో శేఖర్ ప్రశ్నిస్తే దాడి చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని, వ్యక్తులనుగానీ, వారి నాయకుడిని గానీ ఏమి అనలేదు కదా? అని ప్రశ్నించారు. ఇటీవల కొడిమ్యాల మండలంలోని రామకిష్టాపూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మల్లేశం మీదా కాంగ్రెస్ శ్రేణులు దాడులు చేయడమేకాకుండా అట్రాసిటీ కేసు పెట్టించారని దుయ్యబట్టారు.
చొప్పదండి నియోజకవర్గంలో గుండా, రౌడీ కల్చర్ పెరుగుతున్నదని ఆగ్రహించారు. ప్రశ్నించే వ్యక్తులపై దాడులు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. తీరుమార్చుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు తలొగ్గవద్దని, చట్టబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వానికి చేతనైతే 420 హామీలను అమలు చేయాలని, కొండగట్టు ఆలయ అభివృద్ధిలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన సంతలోని లొద్ది పంప్హౌస్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. శేఖర్పై దాడి విషయంలో మల్యాల ఠాణాలో ఫిర్యాదు చేశామని, పోలీసులు కేసు నమోదు చేయకపోతే త్వరలోనే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అయిల్నేని సాగర్రావు, జనగం శ్రీనివాస్, బద్దం తిరుపతిరెడ్డి, తైదల శ్రీలత, దొంతరవేని శేఖర్, లావణ్య, ఆకుల నగేశ్, శ్రీనివాస్గౌడ్, నారాయణ, గంగాధర్, సంజీవ్, నగేశ్, దశరథం, పూడూరి చందు పాల్గొన్నారు.