జగిత్యాల, సెప్టెంబర్ 18: ‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఊరించి ఉసూరుమనిపించింది. అనేక కొర్రీలు పెట్టి వేలాది మందికి ఎగనామం పెట్టింది. ఇంటికి ఒకరికీ అని, రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమేనని ఇలా పలు రకాలు నిబంధనలు పెట్టి ఎగ్గొట్టిన్రు. కాంగ్రెస్ మాట లు నమ్మి రైతులు నిండా మునిగిన్రు. ఇప్పుడు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరిగి వేసారుతున్నరు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఇది ప్రభుత్వానికి సరికాదని, ఎలాంటి ఆంక్షలు లేకుం డా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆధ్వర్యంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, రైతులతో కలిసి బుధవారం కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రుణమాఫీ కానీ రైతుల వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. రుణమాఫీ పూర్తిగా అంకెల గారడీ అని, చేసింది గోరంత అయితే, చెప్పుకొనేది కొండంత అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చునే దాకా ఓ మాట, తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
రేవంత్ సర్కారు అబద్ధపు పునాదుల మీద ఏర్పడిందని, అది ఎంతో కాలం నిలువదన్నారు. ముఖ్యమంత్రి రైతులందరికీ మాఫీ చేశామని చెబుతుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం, మంత్రులు మాత్రం ఇంకా ఇవ్వాల్సి ఉందని, ‘ఇగో ఇస్తం, అదిగో ఇస్తం’ అని చెబుతూ మభ్యపెడుతున్నారని, ప్రభుత్వ పెద్దల వద్దే స్పష్టత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పైసలే రుణమాఫీకి డైవర్ట్ చేశారని, అనేక ఆంక్షలు పెట్టి వేలాది మందికి మాఫీ ఎగ్గొట్టారని, పైకి మాత్రం రైతులందరికీ రూ.2లక్షలు మాఫీ చేసి బడాయి కొడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ కాని రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టు తిరుగుతూ అలసిపోతున్నారని, రేషన్ కార్డు వద్దని ముఖ్యమంత్రి అంటాడని, రేషన్ కార్డు కావాలని బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు అంటున్నారని, అసలు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక విధానం అంటూ ఉందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, ఎలాంటి ఆంక్షలు లే కుండా రుణమాఫీ చేయాలని, లేదంటే రైతు ఉద్యమం మొదలవుతుందని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు రుణమాఫీ కానీ రైతులు పాల్గొన్నారు.