జగిత్యాల, జూలై 17 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి 30 నెలలు దాటినా వాటి ఊసెత్తడం లేదని, అలాంటి ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి మండిపడ్డారు. ఇంకా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం లేదని ఆగ్రహించారు. అసలు కేసీఆర్ పాలనలో విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు మంగళం పాడిందని ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు దవాఖానను శుక్రవారం సాయంత్రం పార్టీ నాయకుడు రాంచంద్రారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. బాలింతలతో మాట్లాడారు.
‘కేసీఆర్ కిట్ ఇస్తున్నారా?’ అని ఓ మహిళను ప్రశ్నించగా, తనకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏదీ రావడం లేదని తెలిపారు. అనంతరం జీవన్రెడ్డి మాట్లాడుతూ జననీ మాతా శిశు సంరక్షణ పథకం ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మగ శిశువుకు రూ.12 వేలు, ఆడ శిశువుకు రూ.13 వేలు ఇచ్చేవారని, ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేసీఆర్ కిట్ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకుని ప్రసూతి భారం కాకూడదని కేసీఆర్ అమలు చేసిన కిట్ను నిలిపివేయడం సరికాదన్నారు. కేసీఆర్ కిట్ రావడం లేదని ప్రసూతికి వేరే చోటికి వెళ్లకూడదని, ప్రభుత్వ దవాఖాన సేవలు వినియోగించుకోవడం మన హక్కని సూచించారు.