మెట్పల్లి, మే 9: వరి, మక్క కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి విమర్శించారు. కాంటాలు పెట్టడంలో జాప్యంపై రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే తప్పా అధికార యంత్రాంగం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. గత సీజన్లో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ సారి 25శాతం కూడా కొనకపోవడం దారుణమన్నారు. బస్తాకు మూడు కిలోల చొప్పున తరుగు కింద కోత విధిస్తుండడం వల్ల ఎకరానికి రూ.3వేల చొప్పున రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ మేరకు శనివారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావుతో కలిసి జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్క, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు నష్టం కలుగకుండా చూడాలని అదనపు కలెక్టర్తో ఫోన్లో జీవన్రెడ్డి కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులను మభ్యపెట్ట్టేందుకే ప్రభుత్వం పంటల మార్పిడి అంటుందన్నారు. కోతుల పునరుత్పత్తిని నిరోధించేందుకు మండలానికో పునరుత్పత్తి నిరోధక కేంద్రాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లకు పగుళ్లు వస్తే మరమ్మతులు చేసేందుకు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నా.. ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత జలాలను ఎల్లంపల్లికి మళ్లిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రాణహిత జలాలను ఎల్లంపల్లికి మళ్లించకపోతే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. అధికారంలోకి వచ్చాక 30నెలలు నిద్రపోయి ఇప్పుడు తుమ్మిడిహట్టి ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరూ ఒక్కటేనని.. ఆ ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 10న హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీతో మాట్లాడి తుమ్మిడిహట్టి ఎత్తు పెంపునకు సంబంధించి అప్రూవల్ తీసుకొస్తే తాము కూడా పాలాభిషేకం చేస్తామన్నారు. ఓటుకు నోటు కేసులో బయటపడేందుకే మోదీతో చోటే భాయ్ రేవంత్రెడ్డి స్నేహ సంబంధం బలపడుతుందని ఎద్దేవా చేశారు.
ఫోర్త్ సిటీ (ప్యూచర్ సిటీ)పై ఉన్న శ్రద్ధ రేవంత్రెడ్డికి రైతులపై లేదన్నారు. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే వ్యవసాయం రాబోయే రోజుల్లో కనుమరుగవడం ఖాయమన్నారు. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలో చేసిన రైతు డిక్లరేషన్ అటకెక్కిందని, రైతు భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టారని, సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి అసలు ధర కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సమర్థించలేకనే తాను ఆ పార్టీ నుంచి బయటకి వచ్చానని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కందరి ప్రతాప్రెడ్డి, నేరెళ్ల మోహన్రెడ్డి, అంగి పురుషోత్తం, పూదరి సుధాకర్గౌడ్, ఎనగందుల శ్రీనివాస్గౌడ్, పీసు తిరుపతిరెడ్డి, బంగారుకాళ్ల కిశోర్, కంటం రమేశ్, ఎండీ జావీద్, ఆకుల ప్రవీణ్, విష్ణువర్దన్, తదితరులు ఉన్నారు.