కథలాపూర్, జూలై 26: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి! ఇప్పటికే ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటికి తండ్లాడుతుండగా, ఇటీవలే మరో పిడుగు వేసింది. వానకాలం సీజన్ వేళ సరిపడా ఎరువులు అందించకుండా గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కారు, ఎరువుల ఉచిత రవాణా చార్జీలను ఎత్తివేసింది.
ఇన్నాళ్లూ స్టాక్ పాయింట్ నుంచి ఎరువుల బస్తాల రవాణా చార్జీలన్నీ ప్రైవేట్ వ్యాపారులు భరించగా.. సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలకు మాత్రం ట్రాన్స్పోర్ట్ చార్జీలను మార్క్ఫెడ్ భరించేది. రెండు వారాల క్రితమే ప్రభుత్వం ఉచిత యారియా, ఎరువుల సరఫరాను రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యూరియా, ఎరువుల ధరలు పెరిగే ముప్పు పొంచి ఉన్నది.
ఇటు ప్రైవేట్ వ్యాపారులు కూడా అడ్డగోలు ధరలు పెంచడమే కాదు, యూరియాను బ్లాక్ చేసే ప్రమాదమున్నది. ప్రస్తుతం యూరియా బస్తా ధర రూ.266 ఉండగా… రవాణా చార్జీలు ఎత్తివేయడంతో ఒక్కో బస్తాను రూ.310 నుంచి రూ.330 వరకు విక్రయించవచ్చని తెలుస్తున్నది. ఇలానే ఎరువుల ధర పెరగనున్నది. ఒక్క జగిత్యాల జిల్లాలో చూస్తే రూ.1.50 కోట్లకుపైగా భారం పడనున్నది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని అన్నదాతలపై దాదాపు రూ.5కోట్లకు పైగా అదనపు భారం పడనుండగా, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో పంటలు సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నదని, ఇలాంటి సమయంలో రవాణా చార్జీలను ఎత్తివేయడం తమకు మరింత ఆర్థికంగా నష్టం చేస్తుందని మండిపడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారుల మాదిరిగానే ఆగ్రోస్, సహకార సంఘాలు ధరలు పెంచి విక్రయించే పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఎరువుల రవాణా విషయంలో పాత నిబంధనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సహకార సంఘాలకు సరఫరా చేసే యూరియా బస్తాల రవాణా చార్జీలను సర్కారు ఎత్తేసుడు కరెక్ట్ కాదు. పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరిగినయి. దిగుబడులు సరిగా రాక రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నరు. ప్రస్తుతం రవాణా చార్జీలు ఎత్తివేయడంతో యూరియా ఒక్క బస్తాకు రూ.320 నుంచి రూ.330 చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం రైతులపై ఆర్థిక భారం వేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి.
– కందరి కిషన్రెడ్డి, రైతు (సిరికొండ)
ఎరువుల ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎత్తేయడం సరికాదు. ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉన్నది. యూరియా బస్తాలను భారీగా నిల్వ చేసి కృతిమ కొరత సృష్టించే ముప్పు ఉన్నది. రైతులు అధిక ధరలకు యూరియా కొనాల్సిన పరిస్థితులు వస్తయి. ప్రభుత్వం ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహించే నిర్ణయాన్ని మానుకోవాలి. ప్రభుత్వమే రవాణా చార్జీలతో సహకార సంఘాలకు యూరియా సరఫరా చేయాలి.
– బద్ధం మహేందర్రెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక నాయకుడు
సహకార సంఘాలకు యూరియా బస్తాలను ఇన్నాళ్లూ మార్క్ఫెడ్ ద్వారా ఉచితంగా రవాణా చేశారు. ఇటీవలే రవాణా చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో యూరియా బస్తాల రవాణా భారం రైతులే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు సహకార సంఘాల ద్వారా యూరియా బస్తాలు విక్రయిస్తాం.
– మనోజ్కుమార్, డీసీవో (జగిత్యాల)