విద్యానగర్, మార్చి 28: అతి త్వరలో కరీంనగర్ మెడికల్ కాలేజీ పనులు పూర్తవుతాయని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న తొమ్మిది వైద్య కళాశాల పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధించిన ఇంజినీరింగ్ ఏజెన్సీల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులతో టీఎస్ఎంఐడీసీ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు రివ్యూ నిర్వహించగా, ఆయన హైదరాబాద్లోని తన అధికారిక నివాసం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్న సాకును చూపి కేంద్ర ప్రభుత్వం కరీంనగర్కు మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి హరీశ్రావ్ ప్రత్యేక కృషితో త్వరితగతిన పనులు జరుపుతున్నాయని, 500 బెడ్లకు సరిపోయే విధంగా కొత్తపల్లిలో టీఎస్ఎస్డీసీ గోడౌన్లను అప్పగించడమే కాకుండా వాటిలో అవసరమైన నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నామన్నారు. విద్యార్థుల వసతికి హాస్టళ్లను సైతం గుర్తించామన్నారు. జిల్లా యం త్రాంగం సమన్వయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాబోయే విద్యా సంవత్సరంలో క్లాసులు ప్రారంభిస్తామని చెప్పారు. వీసీలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్లాల్, డీఎంహెచ్ఓ జువేరియా, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు మంత్రి హరీశ్రావు అభినందన
కరీంనగర్ జిల్లాలో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమంలో మహిళలను అధికంగా భాగస్వా మ్యం చేస్తూ మంచి ఫలితాలు సాధించినందుకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు. అలాగే ఇతర జిల్లాల్లో సైతం అమలు చేయాలని సూచించారు. కంటి వెలుగుపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రతి జిల్లా కేంద్రంలో టిఫా సానింగ్ యంత్రం అందుబాటులో ఉంచామని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో గర్భిణులు పరీక్ష నిర్వహణకు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నారు. ఆకస్మిక గుండెపోటు నివారణకు చేపట్టిన సీపీఆర్ శిక్షణ వివిధ వర్గాల ప్రజలకు పకడ్బందీగా అందించాలని సూచించారు.