జగిత్యాల కలెక్టరేట్, జనవరి 10: గృహలక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించి.. నిధులు వెంటనే మంజూరు చేయాలని జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల లబ్ధిదారులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనే వారికి గృహలక్ష్మి ద్వారా రూ.3లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రొసీడింగ్ ఇవ్వడంతో నిర్మాణాలు ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని బంద్ చేస్తామని చెప్పడంతో తామంతా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు.
గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తామన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కింద తమకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దళితబంధు పథకాన్ని సైతం కొనసాగించాలని పలువురు దళితులు కోరారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర అక్కడికి చేరుకున్నారు. గృహలక్ష్మి నిధుల విడుదల గురించి ప్రభుత్వానికి నివేదిస్తామని లబ్ధిదారులకు ఆయన హామీఇచ్చారు. ఇక్కడ జగిత్యాల మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ కూసరి అనిల్, బీఆర్ఎస్ నాయకులు సమిండ్ల శ్రీనివాస్, వొద్ది రామ్మోహన్రావు, కత్తురోజు గిరి, లబ్ధిదారులు ఉన్నారు.