Veenavanka | వీణవంక, ఆగస్టు 31 : బ్రాహ్మణపల్లి చెక్ డ్యాం వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సంపత్, మండల కార్యదర్శి పిల్లి రవియాదవ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిలో సీపీఎం నాయకులు, బ్రాహ్మణపల్లి రైతులు మండల ప్రత్యేకాధికారి సాల్మాన్రాజ్, ఎంపీడీవో రవిసుధాకర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో వాగుపై 2021లో చెక్ డ్యాం నిర్మించగా పక్కన కరకట్ట నిర్మాణం సరిగా చేయకపోవడం వల్ల వర్షాలు ఎక్కువపడి పక్కనే ఉన్న 10 మంది రైతులకు చెందిన సుమారు పది ఎకరాల పొలాలు కోతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై కాంట్రాక్టర్, అధికారులకు తెలియపరుచగా నష్టపరిహారం కట్టిస్తామని రాతపూర్వకంగా రాసి ఇచ్చి, ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం చెల్లించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి రైతులను న్యాయం చేయాలని, లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు.