Chendurti | చందుర్తి, జూలై 17 : తరగతి గదిలో భావి భారతాన్ని నిర్మించాల్సిన ఉపాధ్యాయులే కయ్యానికి కాలు తీయడం విమర్శలకు తావిస్తోంది. సీనియర్ ని కాదని జూనియర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నారని ఏడాదికాలంగా ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలి వానల మారి చివరకు గలాటకు దారితీసింది. చందుర్తి మండలం బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆనంద రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయుడు రామచంద్ర మధ్య నెలకొన్న వివాదం శుక్రవారం తారస్థాయికి చేరింది.
ఉపాధ్యాయ హాజరు నమోదు(సంతకం) విషయంలో కొద్ది రోజులుగా వివాదం తలెత్తడంతో సీనియర్ ఉపాధ్యాయుడు రామచంద్రం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో ఉపాధ్యాయ హాజరు నమోదులో సంతకం చేసేందుకు వచ్చిన తనను ప్రధానోపాధ్యాయుడు ఆనంద రెడ్డి అడ్డుకోవడంతో ప్రశ్నించిన తనపై దాడికి యత్నించాడని వాపోయారు. దీంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రమేష్ విచారణ చేపట్టారు.