పెద్దపల్లి, జూన్ 22 : అమరుల త్యాగం అజరామరమని, వారి అమరత్వంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మండలి చీఫ్ విప్ తానిపర్తి భాను ప్రసాద్రావు భావోద్వేగానికి లోనయ్యారు. అమరవీరుల త్యాగాలను సర్మించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేద్దామన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అమరుల స్తూపం వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణతో కలిసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండలి చీఫ్ విప్ మాట్లాడుతూ.. తొలి, మలి, తుది దశ ఉద్యమాల్లో రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెకచేయకుండా అనేక మంది త్యాగధనులు ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. వారి త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం స్వప్నం సాకారమైందన్నారు. 1969లో ఉవ్వెత్తున వచ్చిన ప్రజా ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని గ్రహించి 2001లో దానికి ఒక వేదిక కల్పించి మలి దశ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. 14 ఏళ్ల పాటు శాంతియుతంగా ఉద్యమ పంథాతో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం అయ్యారని, యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలు సైతం లెకచేయకుండా ఉద్యమించారని గుర్తుచేశారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో రాష్ట్ర సాధన కోసం 37 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని, వీరి త్యాగాలను గుర్తిస్తూ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందన్నారు. ఆ కుటుంబాలకు ఆసరాగా, అండగా సీఎం కేసీఆర్ నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు, అదనపు కలెక్టర్ వీ లక్ష్మీ నారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, పెద్దపల్లి, జూలపల్లి, కాల్వ శ్రీరాంపూర్ జడ్పీటీసీలు బండారి రామ్మూర్తి, బొద్దుల లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల బండారి స్రవంతి-శ్రీనివాస్గౌడ్, బాలాజీ రావు, రేణుకాదేవి, పెద్దపల్లి ఏఎంసీ చైర్మన్ జడల సురేందర్, పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నాజ్మీన్ సుల్తానామొబిన్, ప్రజాప్రతినిధులు, నాయకులు లైశెట్టి భిక్షపతి, పైడ పద్మ రవి, పురుషోత్తం, పెద్ద వెంకటేశ్, మార్కు లక్ష్మణ్, ఉప్పు రాజ్కుమార్, కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల కుటుంబాలకు ఘన సన్మానం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరవీరుల కుటుంబాలతో కలిసి మండలి చీఫ్ విప్, కలెక్టర్, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు అల్పాహారం స్వీకరించారు.
వారిని నిరంతరం స్మరించుకోవాలి
మలిదశ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిస్తూ ఉద్యమ వేడిని ఢిల్లీ పెద్దలకు తాకేలా సీఎం కేసీఆర్ చేసిన కృషి మరలేనిది. 14 ఏళ్ల పాటు సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయులు అందించిన సహాయ సహకారాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ వేడిని ఢిల్లీకి తాకేలా పోరాడారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు నిప్పు కణికల్లాగా, ప్రాణాలను సైతం లెకచేయకుండా పోరాడారు. శరీరం నిప్పుతో కాలుతున్నప్పటికీ శ్రీకాంతాచారి ‘జై తెలంగాణ’ అంటూ ప్రాణాన్ని అర్పించాడు. అమరుల త్యాగాలు, అనేక మంది ఉద్యమకారులు చేసిన కృషి ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అమరుల త్యాగాలను మనం నిరంతరం స్మరించుకోవాలి. వారి ఆశయ సాధనకు ఐకమత్యంతో కృషి చేయాలి.
– దాసరి మనోహర్రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే