కలెక్టరేట్/విద్యానగర్, ఫిబ్రవరి 3: జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా గణతంత్ర వేడుకల్లో వారిని సత్కరించినట్లు పేర్కొన్నారు. పథకాల అమలులో దివ్యాంగులకు ఇబ్బందులు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.
జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులపై జరిగే దాడి ఘటనల్లో సరైన న్యాయం అందేలా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు తగిన ఆదేశాలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన పుస్తకాలు అందించాలని గ్రంథాలయ కమిటీ సభ్యులను కోరారు. సదరం సర్టిఫికెట్ల జారీలో దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
స్లాట్ బుకింగ్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేసే మీసేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సదరం సర్టిఫికెట్లు అనర్హులకు అందకుండా వైకల్య నిర్ధారణ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయించాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూవో సరస్వతి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డా.వీరారెడ్డి, డీఆర్డీవో శ్రీలత, జడ్పీ సీఈవో పవన్కుమార్, ఎల్డిఎం ఆంజనేయులు, మెప్మా పీడీ రవీందర్, సీఐ సరిలాల్, దివ్యాంగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీనివాస్, దివ్యాంగుల సంఘం జిల్లా నాయకుడు జక్కం సంపత్, తదితరులు పాల్గొన్నారు.