కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 15 : నేత కార్మికులకు ఎలాంటి సెక్యూరిటీ, మార్టిగేజ్ అవసరం లేకుండా ముద్ర రుణాలు అందజేస్తున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం చేనేత కార్మికుల కోసం కొత్తగా రూపొందించిన టీ-నేతన్న యాప్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు మూలధన అవసరాల కోసం చేనేత ముద్ర లోన్స్ ద్వారా గరిష్ఠంగా 5 లక్షల రుణాన్ని 25 శాతం మార్జిన్ మనీ సబ్సిడీ, గరిష్టంగా 10 వేల ఎంవోటీ ఇవ్వడంతోపాటు ప్రగతి ఆధారంగా 6 నుంచి 7 శాతం వరకు వడ్డీ రాయితీ కల్పించనున్నట్లు వెల్లడించారు.
బ్యాంకుల్లో ముద్ర లోన్లపై మార్టిగేజ్, సెక్యూరిటీ అడిగినట్లయితే తమ దృష్టికి తేవాలని సూచించారు. చేనేత, పవర్లూం కార్మికుల కోసం అందిస్తున్న వివిధ పథకాల రాయితీ కోసం టీ-నేతన్న యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. అధికారులు ఈ యాప్పై సంపూర్ణ సమాచారాన్ని లబ్ధిదారులకు కల్పించాలన్నారు. నేత కార్మికులు తయారు చేసిన టవల్స్, కర్టెన్స్ను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించేలా చర్యలు చేపడుతామన్నారు.
అలాగే, మార్కెటింగ్ కోసం కృషి చేస్తామన్నారు. ఒకే విధమైన ఉత్పత్తులు కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చేనేత ఉత్పత్తుల్లో మార్పులు తేవాలని సూచించారు. నేతన్న యాప్లో సాంకేతిక సమస్యలను వారంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వీ అశోక్రావు, సహాయ సంచాలకులు ఎస్ఎస్ చరణ్, టెస్కో డీఎంవో వెంకటేశ్వర్లు, కోర్కల్ చేనేత సహకార సంఘం పీఐసీ సత్యనారాయణ, ఊటూరు చేనేత సహకార సంఘం పీఐసీ రాంచంద్రం పాల్గొన్నారు.